గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 మార్చి 2020 (16:30 IST)

శ్రీవారికి కరోనా వైరస్ పోటు... దర్శనం నిలిపివేత

కలియుగవైకుంఠంగా భాసిల్లుతున్న శ్రీవేంకటేశ్వర స్వామికి కూడా కరోనా వైరస్ భయం తప్పలేదు. శ్రీవారి నివాసమైన ఏడు కొండలు ప్రాంతంలో కరోనా వైరస్ వ్యాపించకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నిర్ణయంలో భాగంగా, గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి మూలవిరాట్టుకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని తెలిపింది.
 
అలాగే, తిరుమల ఘాట్‌రోడ్లను కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ప్రకటించారు. అలిపిరి గరుడ సర్కిల్‌ నుంచి వచ్చే భక్తులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఎగువ ఘాట్‌ రోడ్డుపైకి వాహనాలు వెళ్లకుండా అధికారులు నిలిపివేస్తున్నారు. 
 
కొండ పైనుంచి వాహనాలను కిందకు మాత్రమే అనుమతిస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలన్నీ కిందకు వచ్చాక దిగువ ఘాట్‌ రోడ్డును కూడా మూసేయనున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్లు కాలినడక మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఘాట్‌ రోడ్లను మూసివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు.
 
పాతాళగంగలో స్నానాలు నిలిపివేత 
మరోవైపు, కరోనా ప్రభావం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని దేవస్థానాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనంను నిలిపివేస్తున్నారు. 
 
ఇక శ్రీశైలం దేవస్థానం సైతం కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలకు ఉపక్రమించింది. గురువారం నుంచి శ్రీశైలంలోని పాతళగంగలో భక్తుల పుణ్యస్నానాలను నిలిపివేస్తూ ఆలయ అధికారులు నిర్ణయం వెలువరించారు. అంతేకాకుండా భక్తులు దర్శనానికి రావొద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా వస్తే వారిని స్క్రీనింగ్‌ చేశాకే ఆలయంలోకి అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.