శుక్రవారం, 18 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 జులై 2022 (12:14 IST)

శాంతించిన గోదారమ్మ... 47.9 అడుగులకు చేరిన నీటిమట్టం

bhadrachalam godavari
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం క్రమంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం గోదావరి నీటిమట్ట 47.9 అడుగులకుచేరుకుంది. అంటే 1139230 క్యూసెక్కులు నీటి ప్రవాహంగా ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. 
 
గోదావరికి వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద నీటిమట్టం రికార్డు స్థాయికి చేరిన విషయం తెల్సిందే. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువున ఉన్న ప్రాజెక్టులు గేట్లు మూసివేశారు. దీంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద క్రమంగా తగ్గుతూ వస్తుంది. 
 
మరోవైపు, ఎగువ జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో ప్రాజెక్టుకు లక్షా ఆరు వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. 16 గేట్ల ద్వారా లక్షా 58 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.60 టీఎంసీల నీరు నిల్వవుంది. 
 
అదేవిధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చిచేరుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు కూడా క్రమంగా నిండుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2,52,967 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 19040 నీరు దిగువనకు వెళుతున్నది. 
 
జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ఇపుడు 876 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 168.2670 టీఎంసీల నీరు ఉంది.