శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (10:04 IST)

భద్రాచలం వద్ద మహోగ్రరూపం... 58 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం

bhadrachalam godavari
గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదిలోకి వరద నీరు ఒక్కసారిగా పోటెత్తింది. దీంతో భద్రాచలం వద్ద నీటిమట్టం అంతకంతకూ పెరుగుతోంది. 
 
ప్రస్తుతం రామయ్య పాదాల చెంత 17.14 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. నీటిమట్టం 58.50 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. అయితే ప్రమాద హెచ్చరికను దాటి ఐదు అడుగులకుపైగా నీరు ప్రవహిస్తుంది. వరద ప్రవాహం కరకట్టను తాకడంతో అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు.
 
ముంపు వాసులను పునరావాస కేంద్రాలను తరలించాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. దీంతో ముంపు మండలాల్లోని 45 గ్రామాలకు చెందిన సుమారు 4,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే గోదావరి నీటిమట్టం 60 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.
 
అలాగే, శ్రీరాం సాగర్ ప్రాజెక్టు వద్ద కూడా వరద నీరు కొనసాగుతోంది. దీంతో అధికారులు 36 గేట్లన ఎత్తివేసి ప్రాజెక్టులోకి వచ్చే నీటిని కిందికి వదిలివేస్తున్నారు. ప్రాజెక్టులోకి ప్రస్తుతం 4,18,510 అడుగుల క్యూసెక్కుల నీరు వస్తుండగా, 4,50,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలివేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1087.40 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది.