1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 12 జులై 2022 (10:31 IST)

భద్రాచలం వద్ద గోదావరమ్మ ఉగ్రరూపం.. ఫ్లడ్ అలెర్ట్

ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు రోజులు అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.
 
మరో మూడు నాలుగు రోజుల పాటు వానలు భారీగా పడనున్నట్లుగా హైదరాబాద్, అమరావతిలోని భారత వాతావరణశాఖ కేంద్రాలు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించాయి. 7, 8, 11 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు ఉండనున్నట్లు అధికారులు అంచనా వేశారు.
 
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. నిన్న దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై ఉన్న అల్ప పీడన ప్రాంతం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా తీర ప్రాంతాల్లోకి విస్తరించి దానికి అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో మీటర్ల వరకూ విస్తరించి ఎత్తుకు వెళ్లేకొలదీ నైరుతి దిశగా వంగి ఉంటుంది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత గుర్తించే అవకాశం ఉంది.
 
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. 
 
ఇకపోతే.. భద్రాచలం వద్ద గోదావరమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 
 
గోదావరి భీకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మధ్య రాకపోకలు స్తంభించాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.