కేసీఆర్ ఆయుత చండీ యాగంలో చంద్రబాబు.. సత్కరించి, జ్ఞాపిక అందజేసిన టీ సీఎం
మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి, చండీమాతను దర్శించుకున్నారు. కేసీఆర్తో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్ట్రమంత్రులు కేఈ కృష్ణమూర్తి, గంటాశ్రీనివాసరావులను సీఎం కేసీఆర్ శాలువాలతో సత్కరించారు. చంద్రబాబుకు చండీ అమ్మవారి విగ్రహాన్ని జ్ఞాపికగా అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయుత మహా చండీయాగం ఐదోరోజు కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంప్రదాయ దుస్తుల్లో చండీ యాగంలో పాల్గొన్నారు. విజయవాడ నుంచి చంద్రబాబు.. కనకదుర్గమ్మ అమ్మవారి చీర, కుంకుమ, ప్రసాదం తీసుకొచ్చారు.