40 లక్షలే తీసుకున్నా.. నయనతార
తెలుగులో అవకాశాలు సన్నగిల్లాక నయనతార రూట్ మార్చేసింది. మాజీ ప్రియుడు శింబుతో తమిళంలో 'ఇదు నమ్మ ఆలూ' చిత్రంలోను, సూర్యతో 'మాస్', జయం రవితో 'తానీ ఒరువన్', విజయ్తో 'నాన్ రౌడీదాన్', ఉదయనిధి స్టాలిన్ సరసన 'నాన్బెన్డా' వంటి తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ తాజాగా మళయాళంలో మమ్మూట్టి సరసన 'భాస్కర్ ద రాస్కెల్' చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అయితే ఈ చిత్రంలో నటించడానికి నయన బోలెడన్ని షరతులు పెట్టిందని వినికిడి.
ఈ చిత్రానికి సిద్దిఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఇదే దర్శకుడి దర్శకత్వంలో 'బాడీగార్డ్' అనే చిత్రంలో నయన నటించింది. ఆ చిత్రం టాలీవుడ్లోను, బాలీవుడ్లోనూ రీమేక్ అయ్యింది. దీంతో హీరోయిన్గా నయన రేంజ్ మారిపోయింది. అంత స్థాయిని తీసుకొచ్చిన ఆ చిత్ర దర్శకుడితో మరో చిత్రంలో నటించేందుకు నయన షరతులు పెట్టడం ఓ ఎత్తయితే, పారితోషికాన్ని సైతం అమాంతం పెంచేందని మాలీవుడ్ సినీ వర్గం ముక్కున వేలేసుకుంటోంది.
అయితే ఇవి రూమర్లు మాత్రమేనని ఈ చిత్రంలో నటించేందుకు కేవలం 40 లక్షలు మాత్రమే తీసుకుంటున్నానని, అది కూడా ఆ దర్శకుడి ప్రతిభ ఉన్న నమ్మకంతోనే ఇంత బిజీగా ఉన్నా నటించేందుకు అంగీకరించానని నయన సమర్థించుకుంటోంది. ప్రభుదేవాతో లవ్ ఫెయిల్యూర్ తర్వాత క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండటానికి నయన ఇష్టపడుతోంది. అయితే ఈ క్రమంలో మాజీ ప్రియుడు శింబుతో కూడా నటనలో భాగంగానే అతని సరసన నటిస్తోందట. అలాగే బాలీవుడ్లోగాని, కోలీవుడ్లోగాని ప్రభుదేవా సరసన నటించేందుకు కూడా రెడీ అంటోంది నయన.