జీవితమే తమాషా అని చెప్పిన అక్కినేని నాగేశ్వర రావు పుట్టినరోజు సెప్టెంబరు 20
నాటకాల్లో ఆడవేషాలు వేస్తూ... నటుడిగా సినీరంగంలో వెలుగొందుతూ.. ఉన్నత శిఖరాలు చేరిన అక్కినేని నాగేశ్వరరావు బతికున్న రోజుల్లో జీవితమే ఓ తమాషాగా అభివర్ణించేవారు. ఆయన జయంతి ఆదివారం. ఈ నెల 20వ తేదీ... 90 ఏళ్ల వయసులో చనిపోయే వరకూ ఎవర్గ్రీన్గానే వున్నారు. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణాజిల్లా వెంకట రాఘవాపురం గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు సెప్టెంబర్ 20, 1923లో జన్మించారు.
"కానీ చాలాసార్లు తన పుట్టినరోజు ఎప్పుడో తనకే సరిగ్గా తెలియదని, ఆరోజుల్లో ఇలాగా పుట్టినరోజు పత్రాలు రాసుకునేవారు కారని చెప్పేవారు. అప్పట్లో గవర్నమెంట్ రికార్డులో 1924 సెప్టెంబరు 21, ఆదివారం పుట్టానని రాసుంది. అమ్మేవో 'నువ్వు శనివారం పుట్టావురా అబ్బాయ్' అని కచ్చితంగా చెప్పింది. కరణంగారు గుడివాడకెళ్లి రికార్డుల్లో రాయించేసరికి ఓరోజు ఆలస్యమైంది. అంటే, నేను సెప్టెంబరు ఇరవైన పుట్టానన్నమాట! ఆ సంగతి తెలిసేటప్పటికి నా వయసు ఇరవై. తెలిశాక కూడా నేనెప్పుడూ పుట్టినరోజు పండగ జరుపుకోలేదు. ఆ అలవాటు మా ఇంటావంటా లేదు. అయితే, 'బుద్ధిమంతుడు' సరిగ్గా సెప్టెంబరు ఇరవైన విడుదలకు వచ్చింది. పోస్టర్ల మీద 'బర్త్డే రిలీజ్' అని వేయించమంటారా? అనడిగారు ముళ్లపూడి వెంకటరమణ. సరే అన్నాను. నాకేం తెలుసు? ఇంత గొడవ జరుగుతుందనీ... ఇంతమంది అభిమానులు నా పుట్టినరోజు జరుపుకుంటారనీ. అసలు నా జీవితమే ఓ తమాషా...'' అని ఒకప్పుడు అన్నారు ఏఎన్నార్.
1953లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకుగాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నటసామ్రాట్ అక్కినేని ప్రస్థానం అద్భుతం. 1966లో విడుదలైన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత అక్కినేనికే దక్కింది. 1975లో భార్య అన్నపూర్ణ పేరు మీద అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించిన అక్కినేని అన్నపూర్ణ బ్యానర్లో మొదటి సినిమా కళ్యాణి. అన్నపూర్ణ బ్యానర్లో వచ్చిన మొదటి బ్లాక్బస్టర్ మూవీ ప్రేమాభిషేకం. 1981లో వచ్చిన ఈ సినిమా ఓ సంచలనం సృష్టించింది. అక్కినేని నటించిన తొలి స్వర్ణోత్సవ చిత్రం 1971లో వచ్చిన దసరాబుల్లోడు.
తెలుగులో తొలి ద్విపాత్రాభినయం చేసిన నటుడు అక్కినేని నాగేశ్వర రావు. చిత్ర పరిశ్రమని హైదరాబాద్కి రావడానికి ఎంతో కృషి చేశారు. పరభాషా చిత్ర పరిశ్రమ నుండి తెలుగు చిత్ర పరిశ్రమని వేరుచేసి మన పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటిన మహా నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత. అన్నపూర్ణ స్టూడియోస్ని స్థాపించి యువసామ్రాట్, నవ యువ సామ్రాట్ ఇలా తన వారసులను అందించిన మహా వృక్షం. కళాప్రపూర్ణ గౌరవ డాక్టరేట్ అందుకున్న అక్కినేని 1968లో పద్మశ్రీ అవార్డు, 1988లో పద్మభూషణ్, 1989లో రఘుపతి వెంకయ్య, 1990లో దాదా సాహెబ్ ఫాల్కే, 1996లో ఎన్టిఆర్ అవార్డులు అందుకున్నారు. 2011లో పద్మవిభూషణ్ అందుకున్న ఏకైక నటుడు.
భారతీయ సినీ రంగంలో అక్కినేని చేసిన అత్యుత్తమ సేవలకు గాను గౌరవ పద్మవిభూషణ్ అవార్డును అందుకున్న తొలి తెలుగు నటుడు. అక్కినేనిని జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సినీ పరిశ్రమకి అక్కినేని ఓ లెజెండ్. ఇలాంటి లెజెండ్ ఈరోజు మనతో లేకపోవడం బాధాకరమైనదే. ఆయన కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ జనవరి 22న కీర్తిశేషులయ్యారు. ఆయన నటించిన ఆఖరి సినిమా మనంతో మనందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు అక్కినేని. ఆయన కుటుంబ సభ్యులు... మూడవ తరం అఖిల్ సినిమా ఆడియోను అక్కినేని జయంతి సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా నిర్వహిస్తున్నారు.