నడిగర్ సంఘ ఎన్నికలు : తొలిసారి రజనీకాంత్ - కమల్హాసన్ భిన్నస్వరాలు.. ఎందుకని?
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అగ్రనటులు రజనీకాంత్, కమల్ హాసన్ను తొలిసారి విభిన్నంగా వ్యాఖ్యానించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
తన ఓటును వేసిన తర్వాత రజనీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ దక్షిణ భారత నటీనటుల సంఘం పేరును తమిళనాడు నటీనటుల సంఘంగా మార్చాలని, కొత్త కార్యవర్గం వెంటనే దీన్ని నెరవేర్చాలంటూ వ్యాఖ్యానించారు. అలాగే, ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వారు ప్రాణం పోయినా సరే వాటిని నెరవేర్చాలని, లేనిపక్షంలో తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ తర్వాత మరికొద్దిసేపటికి తన ఓటు హక్కును వినియోగించున్న కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ నటీనటులకు భాష, ప్రాంతీయ భేదాలు ఉండకూడదని, కళ, వినోదరంగాలకు సరిహద్దులు లేవన్నారు. అదేసమయంలో నడిగర్ సంఘం పేరును ‘భారతీయ నటీనటుల సంఘం’గా మారిస్తే మరింత సమంజసంగా ఉంటుందన్నారు.
తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ఈ ఇద్దరు అగ్రనటుల మధ్య మాటల యుద్ధం కోలీవుడ్ను కుదిపేసే అవకాశాలు లేకపోలేదు. ఈ ఇద్దరు అగ్రనటులు తొలిసారిగా నటీనటుల సంఘం పేరు మార్పుపై విభిన్న ప్రకటనలు చేయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ నటీనటులు చెన్నైలో స్థిరపడినప్పుడు ఏర్పడిన ఈ సంఘం పేరు ఇప్పటికీ ‘దక్షిణ భారత నటీనటుల సంఘం’గానే కొనసాగుతోంది. ఇదే అంశంపై నటీనటుల మధ్య ఆసక్తికర చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో హీరో శరత్ కుమార్కి వ్యతిరేకంగా పోటీకి దిగిన విశాల్ తెలుగువాడు కావడమే ఈ ప్రతిపాదన వెనుక అసలు కారణంగా కన్పిస్తోంది.