పేకాట శిబిరాలపై పోలీసుల దాడులు.. తప్పించుకునే క్రమంలో పేకాటరాయుడి మృతి!!
కృష్ణానదిలోని పేకాట శిబిరాలపై పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ఓ పేకాట రాయుడు కాళ్లకు పని చెప్పాడు. అయితే, తప్పించుకునే ప్రయత్నంలో కృష్ణానది నీటిపాయలో దూకి, అందులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం రొయ్యూరు సమీపంలోని లంక భూముల్లో కొందరు వ్యక్తులు జూదం ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో తోట్లవల్లూరు పోలీసులు పేకాట రాయుళ్లను అరెస్టు చేయడానికి అక్కడకు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన పేకాటరాయుళ్లు భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు.
ఈ క్రమంలో కంకిపాడు మండలం, మద్దూరు గ్రామానికి చెందిన వల్లభనేని గోపాలరావు (30) అనే వ్యక్తి కృష్ణానది పాయలో ఉన్న నీటి గుంతలోకి దూకి అవతలి ఒడ్డుకు చేరుకోవడాని ప్రయత్నించాడు. అయితే, ఆ నీటి పాయను ఈదలేక నీటిలో మునిగి చనిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు వెంటనే అప్రమత్తమై నదిలోకి దిగి గోపాలరావును బయటకు తీశారు. కానీ అప్పటికే అతని మృతి చెందినట్టు గుర్తించారు.
ఈ విషయం తెలుసుకున్న గోపాలరావు బంధువులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడుకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేయగా, తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.