గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2020 (13:16 IST)

టీడీపీ అధ్యక్షుడు(ఏపి)గా అచ్చెన్నాయుడు... పొలిట్ బ్యూరోలోకి సుహాసిని

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా కె. అచ్చెన్నాయుడు పేరును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ.. తెలంగాణ టీడీపీ ప్రెసిడెంట్‌గా ఎల్.రమణనే కొనసాగించనున్నారు.
 
ఇకపోతే, టీటీడీపీ ఉపాధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని ప్రకటించారు. 27 మందితో టీడీపీ సెంట్రల్ కమిటీని, 25 మందితో పొలిట్ బ్యూరో కమిటీని ఏర్పాటు చేశారు. పొలిట్ బ్యూరోలో నందమూరి బాలకృష్ణకు స్థానం కల్పించారు.
 
పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, చినరాజప్ప, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నందమూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బొండా ఉమ, ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, రావుల, అరవింద్ కుమార్ గౌడ్‌ను నియమించారు. 
 
పొలిట్ బ్యూరోలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, ఎల్.రమణ కూడా ఉన్నారు. ఇదేసమయంలో పార్టీ అధికార ప్రతినిధులుగా ఆరుగురికి చంద్రబాబు అవకాశం కల్పించారు. వీరిలో ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటు తెలంగాణ నుంచి నండూరి నర్సిరెడ్డి, జ్యోత్స్న, నజీర్, ప్రేమ్ కుమార్, దీపక్ రెడ్డిలు కొనసాగనున్నారు. కాగా, గతంలో ఏపీ శాఖ అధ్యక్షుడుగా కళా వెంకట్రావు ఉన్న విషయం తెల్సిందే.