మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 అక్టోబరు 2020 (13:12 IST)

ఈఎస్ఐ స్కామ్‌లో 'గుమ్మనూరు గుట్టు' : అచ్చెన్నను నేనే ఇరికించా!!: ఏపీ మంత్రి

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే కె.అచ్చెన్నాయుడుని వైకాపా ప్రభుత్వం ముప్పతిప్పలుపెట్టిన విషయం తెల్సిందే. ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఈఎస్ఐ స్కామ్‌లో ఇరికించింది. చివరకు ఈ స్కామ్‌లో అచ్చెన్న డబ్బులు తీసుకున్నట్టు ఎలాంటి ఆధారాలు చిక్కలేదని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తేల్చింది. ఇదే విషయాన్ని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సాక్షాత్ హైకోర్టుకు వెల్లడించారు. దీంతో అచ్చెన్నకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలా 70 రోజుల తర్వాత అచ్చెన్నకు విముక్తి లభించింది. 
 
అయితే, టీడీపీ హయాంలో కార్మిక శాఖామంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆ సమయంలో ఈఎస్ఐ స్కామ్ జరిగిందన్నది వైకాపా ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. అయితే, ఈ కేసులో ప్రభుత్వ కుట్ర ఉందని తాజాగా వెల్లడైంది. ఉద్దేశ్యపూర్వకంగానే కుట్ర చేసి అక్రమ కేసులో ఇరికించింది. ఈ విషయాన్ని టీడీపీ మొదటి నుంచి చెబుతూనే ఉంది. దీన్ని మొన్నటి బుధవారం నాడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం తేటతెల్లం చేశారు.
 
అంతేకాదు, చీకట్లో గోడదూకి మరీ వెళ్లి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన ఏసీబీ... మొదట్లో రూ.900 కోట్ల స్కామ్ అంటూ హడావుడి చేసింది. ఆ తర్వాత రూ.3 కోట్లంటూ అభియోగాలు మోపింది. చివరకు 70 తర్వాత అచ్చెన్నపై పెట్టిన కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, అసలు ఈ స్కామ్‌లో అచ్చెన్నకు డబ్బు చేరలేదంటూ అంగీకరించింది. అందుకు 2019, ఆగస్టు 20వ తేదీన ఏసీబీ జాయింట్ డైరెక్టర్ చెప్పిన మాటలే నిదర్శనం. 
 
ఆ తర్వాత ఆగస్టు 28, 2020న హైకోర్టులో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, అచ్చెన్న డబ్బులు తీసుకున్నట్టుగా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఇపుడు సాక్షాత్ ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఈ విషయాన్ని బట్టబయలు చేశారు. అచ్చెన్నాయుడిని ఈ కేసులో తానే ఇరికించానని బాహాటంగా ప్రకటించారు. అంటే.. ప్రభుత్వమే ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర చేసి అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్ పేరుతో ముప్పతిప్పలు పెట్టింది. చివరకు ప్రభుత్వానికి, ఏసీబీకి హైకోర్టు చురకలు అంటిస్తూ అచ్చెన్నకు బెయిల్ మంజూరు చేసింది.