శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 31 జులై 2016 (15:32 IST)

నాకు ప్రజానీకమే హైకమాండ్.. ఉన్మాదిలా ప్రవర్తించొద్దు.. సోషల్ మీడియాలో చర్చ నిజమే: బాబు

తనకు హైకమాండ్ అంటూ లేదని, తనకు ప్రజానీకమే హైకమాండ్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనకు ఎలాంటి ప్రలోభాలు, ప్రాధాన్యతలు లేవని.. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. తనపై ప్రతిపక్ష నేత

తనకు హైకమాండ్ అంటూ లేదని, తనకు ప్రజానీకమే హైకమాండ్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తనకు ఎలాంటి ప్రలోభాలు, ప్రాధాన్యతలు లేవని.. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. తనపై ప్రతిపక్ష నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని... రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్వని కొందరు నేతలు అసంబద్ధ ఆరోపణలతో సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
 
రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్నాడు. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించాలనే ఆలోచన కూడా లేకుండా ప్రవర్తించడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. 
 
తనపై అవినీతికి సంబంధించిన ఎన్నో కేసులు పెట్టుకుని, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడటం ఏంటని అడిగారు. 30ఏళ్లకు పైగా రాజకీయాల్లో కొనసాగుతున్న తన విశ్వసనీయతపై వేలెత్తి చూపే అర్హత ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. అసత్య ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ పార్టీల అవసరం ఉందా? అని అప్పుడప్పుడు అనిపిస్తుంటోంది. 
 
పేపర్‌, వార్తా ఛానల్‌ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే వూరుకునేది లేదు. అవినీతి సొమ్ముతో అందలం ఎక్కిన నేతలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతారు. రాష్ట్ర సమస్యలపై కేంద్రంపై పోరాడకుండా తనపై కేసు పెడతానని, రాష్ట్రంలో బంద్‌ చేస్తామని ప్రతిపక్ష నేత ప్రకటించడం ఆయన అవగాహనా లోపానికి నిదర్శనమని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధికి పాటుపడకుండా వ్యక్తిగత విమర్శలకు పోయి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. 
 
రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించి సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నిజమనిపిస్తోందని, రాజ్యసభ, లోక్ సభలు రాష్ట్ర భవితవ్యాన్ని పణంగా పెట్టుకుని ఆడుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్‌ ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానంటే... పదేళ్లు కావాలని భాజపా డిమాండ్‌ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడేమో ఆర్థిక సంఘం సిఫార్సులను అడ్డం పెట్టుకుని ప్రత్యేకహోదా ఇవ్వలేమని అనడం ఎంతవరకు సబబు అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదాపై నిర్ణయం తీసుకునే అధికారం 14వ ఆర్థిక సంఘానికి లేదన్నారు. ప్రత్యేక హోదా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినదని.. జీవన్మరణ సమస్య అని అన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌ విభజనకు సహకరించిన భాజపాకు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయంతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకుంటారన్న నమ్మకంతోనే ప్రజలు భాజపాకు ఓటేశారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టాలకు దేశంలోని అనేక పార్టీలు మద్దతు తెలుపుతున్నా కేంద్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఐదు కోట్ల ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున.. ప్రత్యేక హోదా వీలైనంత త్వరగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. 
 
విభజన జరిగి రెండు సంవత్సరాలైన రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం అలసత్వం వహిస్తోందన్నారు. నియోజకవర్గాల పునర్‌ విభజన అంశానికి రెండు రాష్ట్రాలు అంగీకరించినా.. అటార్నీ జనరల్‌ పేరుతో దాన్ని పక్కన పెట్టారన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులతో రాష్ట్రాలకు ఇచ్చిన నిధుల కంటే ఏపీకి ఎక్కువే ఇచ్చామని జైట్లీ చెప్పిన విషయం వాస్తవం కాదన్నారు. నిధుల మంజూరు విషయంలో కేంద్రం చెబుతున్న లెక్కలు నిజం కావన్నారు. అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రకాల పన్నులను కేంద్రానికి కడుతోందని, అయితే కేంద్రం మాత్రం ఏపీపై వివక్ష చూపుతోందని ఆరోపించారు.
 
తాము సంకీర్ణంలో ఉన్నందున ఆ ధర్మాన్ని కాపాడుతూనే ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సీఎం స్పష్టం చేశారు. తాము ప్రధానిని కలిసి పరిస్థితి వివరించాక ఆయన స్పందించే తీరును బట్టి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు.