ఏపీ ప్రజలకు శుభవార్త : ఐదేళ్ల తర్వాత తగ్గనున్న విద్యుత్ చార్జీలు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలోనే విద్యుత్ చార్జీలను తగ్గించనున్నట్టు తెలిపింది. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఏకంగా 9 సార్లు విద్యుత్ చార్జీలను పెంచి వినియోగదారుల నడ్డి విరిచింది. అయితే, ప్రస్తుతం ఏపీలో టీడీపీ సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం తొమ్మిది నెలలు మాత్రమే అయింది. ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ భారాల నుంచి ప్రజలకు ఊరట కల్పించాలని నిర్ణయం తీసుకుంది. పలు డిస్కం పరిధిలో వెయ్యి కోట్ల రూపాయల వరకు ట్రూడౌన్ను ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది.
గత ఐదేళ్లు విద్యుత్ చార్జీలను ఎలా పెంచాలని వైకాపా ప్రభుత్వం ఆలోచించింది. ఏటా ఏదో ఒక పేరుతో చార్జీల భారాన్ని వినియోగదారులపై మోపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా తగ్గించాలన్న ఆలోచన తొలిసారి చేసింది. 2019-24 మధ్య నాలుగో నియంత్రిత వ్యవధిలో రూ.1,059.75 కోట్లను ట్రూడౌన్ చేయాలని నిర్ణయించి, ఆ విధంగా ఏపీ ట్రాన్స్కో ప్రకటించింది.
ఏపీ ఈఆర్సీ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు అదనంగా చేస్తే దాన్ని లెక్కించి ట్రూ అప్ కింద విద్యుత్ సంస్థలు వసూలు చేస్తారు. కమిషన్ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు తక్కువగా ఉంటే ఆ మిగులు మొత్తాన్ని వినియోగదారులకు సర్దుబాటు చేస్తాయి. ఈ మేరకు వినియోగదారులు చెల్లించాల్సిన మొత్తం ఏదోలా తగ్గుతుంది.