గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (11:37 IST)

ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చినా కాంగ్రెస్ పార్టీని పదేళ్లు దూరంగా ఉంచారు : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy
కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చినప్పప్పటికీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉంచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేశ్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రసంగిస్తూ, ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని వెల్లడించారు. కానీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పదేళ్ల పాటు అధికారం దక్కలేదని అన్నారు.
 
గత పదేళ్లు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసిన అనంతరం, తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ విజయంలో కార్యకర్తలదే కీలకపాత్ర అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, పేదలకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 
 
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే రుణమాఫీ చేశామని... రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పామని, చేసి చూపించామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన రెండో రోజు నుంచే హామీల అమలు మొదలైందని, తమది పేదల ప్రభుత్వం అని నిరూపించామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.