ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై చంద్రబాబు యోచన!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత విభిన్నమైన పథకాలను ప్రవేశపెట్టి ఆ రాష్ట్ర ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఇలాంటి పథకాల్లో ఒకటి అమ్మ క్యాంటీన్లు. ఈ క్యాంటీన్లలో ఒక రూపాయికే ఇడ్లీలు, ఐదు రూపాయలకే భోజనం విక్రయిస్తున్నారు. అదే తరహాలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ ‘అన్న క్యాంటీన్’లను తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి అమ్మ క్యాంటీన్లను పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రి పరిటాల సునీత చెన్నై వెళ్లారు.
అంతేకాకుండా, ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా మార్చివేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ యోచిస్తోంది. ఇందుకోసం చౌక ధరల దుకాణాలు (రేషన్ షాపులు), రైతు బజార్ల పనితీరును అధ్యయనం చేసేందుకు మంత్రి పరిటాల సునీతను చెన్నై పంపించినట్టు తెలుస్తోంది. ఏపీలోనూ పేదల ఆకలిని తీర్చేందుకు ఎన్టీఆర్ పేరిట ‘అన్న క్యాంటీన్’లను తెరవాలని బాబు యోచిస్తున్నారు.