కొడాలి నాని నమ్మకద్రోహి.. అసమర్థుడు : వైకాపా నేత ఖాసీ ఆరోపణలు
వైకాపా నేత, మాజీమంత్రి కొడాలి నానిని లక్ష్యంగా చేసుకుని వైకాపా మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాసీ సంచలన ఆరోపణలు చేశారు. దశాబ్దాలపాట గెలిపించిన గుడివాడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వదిలిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నమ్మకద్రోహి అని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొడాలి నాని ఒక అసమర్థుడు, నమ్మకద్రోహి అంటూ ఆరోపించారు.
కొడాలి నాని పనితీరుపై పూర్తి అసహనం ప్రదర్శిస్తూ నానీని నమ్మి మోసపోయామన్నారు. తమను తప్పుదోవ పట్టించిన కొడాలి నాని ఎన్నికల తర్వాత ఎసలు ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు. కార్యకర్తలను గాలికొదిలేయడంతో పాటు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అదేసమయంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆయన అనుచరులు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి అండగా నిలిచారన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ సేవ చేస్తున్నారన్నారు.
ఎన్నికలు అవగానే రాము పారిపోతారంటూ అప్పట్లో తామంతా విస్తృతంగా ప్రచారం చేశామన్నారు. కానీ, ఆయనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను బహిరంగ క్షమాపణలు కోరుతున్నట్టు తెలిపాు. అలాగే, ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు.