శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 5 జనవరి 2022 (14:45 IST)

మిరుమిట్లు గొలిపిన జాతీయ ఆహ్వాన కబడ్డి పోటీలు

తిరుపతి ఇందిరా మైదానంలో  ప్రతిష్టాత్మకంగా జాతీయ మహిళ, పురుషుల ఆహ్వాన కబడ్డి పోటీలు జ‌రుగుతున్నాయి. బాణాసంచా దీపకాంతుల నడుమ పోటీల‌కు శ్రీకారం చుట్టారు. తిరుప‌తి నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఇందిరా మైదానం వేదికగా ఈ పోటీలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, నగరపాలక సంస్థ మేయర్ ఆర్. శిరీషా, ఎం.ఎల్.సి. యండవల్లి  శ్రీనివాసుల రెడ్డి,  డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, తి.తి.దే. అదనపు కార్యనిర్వహణాధికారి ఎ.వి. ధర్మా రెడ్డి, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు, నగరపాలక సంస్థ కమీషనర్ పి.యస్. గిరిషా, ఎస్వీయు వి.సి. రాజారెడ్డి, మహిళా వర్శిటీ వి.సి. జమున, వెటర్నరీ యూనివర్సిటీ వి.సి. పద్మనాభ రెడ్డి, అడిషినల్ ఎస్పీ సుప్రజ లు ఆకాశ దీపాలను వెలిగించి గాలిలోకి ఎగురవేశారు. దీపకాంతులతో జాతీయ కబడ్డీ పోటీల బ్యానర్ ప్రదర్శించారు. బాణాసంచా  కార్యక్రమం దీపావళి పండుగ వాతావరణాన్ని తలపించింది. 
 
 
తిరుపతి ఇందిరా మైదానానికి విచ్చేసిన ప్రముఖులతో పాటు  పురప్రజలు పెద్ద ఎత్తున హాజరై బాణాసంచా కార్యక్రమాన్ని ఆహ్లాదవాతావరణంలో తిలకించారు. ఉల్లాసంగా కార్యక్రమాన్ని 
ఆస్వాదించారు. ఈ ప్రదర్శన నగర ప్రజలకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. ప్రదర్శనలో ప్రధానంగా ఈత చెట్టు, నాగుపాము, సూర్య చక్రం, రన్నింగ్ వీల్ ప్రదర్శన ఆకట్టుకున్నాయి.  వీటితో పాటు తారాజువ్వలు ఆశంలో నాట్య ప్రదర్శనతో  కనిపించాయి.  వివిధ రంగులతో కూడిన షాట్స్ నగర ప్రజలను వీనుల వింకాదు చేసాయి. తార జువ్వలు ఆకాశము వైపు దూసుకెళ్ళడంతో ప్రదర్శన ప్రారంభమైంది. తిరుపతిలో సాంస్కృతిక కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.  మైదానములో వివిధ రంగుల డిస్కో లైట్ల మధ్యలో నిర్వహించిన ప్రదర్శనలు వీక్షకులను మైమరపింప చేశాయి.