1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 5 జనవరి 2022 (11:15 IST)

డ‌బ్బు ఇస్తాం రా అని పిలిచి... సుత్తితో మోది, ఫైనాన్స్ వ్యాపారి హ‌త్య‌!

తిరుపతిలో ఇటీవ‌ల వెలుగుచూసిన ఏపీ టూరిజం సూప‌ర్ వైజ‌ర్ చంద్ర‌శేఖ‌ర్ హ‌త్య కేసు మిస్ట‌రీ వీడింది. అత‌డు టూరిజంతోపాటు సైడ్ బిజినెస్ గా ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. ఆ లావాదేవీల‌లోనే ఈ  దారుణం జ‌రిగింద‌ని పోలీసులు తేల్చారు. ఫైనాన్స్ యజమానిని డ‌బ్బు ఇస్తాం ర‌మ్మ‌ని చెప్పి దారుణంగా హ‌త్య చేశారు. ఫైనాన్స్ వ్యాపారి చంద్రశేఖర్ ను సుత్తితో మోదీ హత్య చేసి, శ‌వాన్ని మూటగట్టి పడవేశారు. 

 
ఇచ్చిన అప్పును తిరిగి చెల్లించమని ఆడుతున్నాడని, ఒత్తిడి చేస్తున్నాడ‌నే కోపంతో నిందితులు అత‌డిని  హత్య చేసేందుకు పథకం వేశారు. డిసెంబర్ 31 న చంద్రశేఖర్ కు ఇవ్వవలసిన నగదు ఇస్తాం రా అని అప్పుతీసుకున్న వ్య‌క్తి  మధు పిలిచాడు. తీరా అత‌ను వ‌చ్చాక‌ చంద్రశేఖర్ కు నగదు ఇవ్వవలసిన మధు తోపాటు మరో ఇరువురు, రాజు, పురుషోత్తంలతో కలసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 

 
డ‌బ్బు తెచ్చుకునేందుకు ఇంటి నుండి వెళ్లిన తండ్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుమారుడు రూపేష్ కుమార్  ఎస్ వి యూ పోలీస్టేషన్ లో పిర్యాదు చేశాడు. పోలీసులు చంద్ర‌శేఖ‌ర్ మిస్సింగ్ కేసును న‌మోదు చేసి, దానిని ఛేదించడంలో ఆనాడు కాల్ లిస్ట్ సేకరణ చేశారు. కాల్ లిస్ట్ ఆధారంగా  విచారణ చేపట్టిన పోలీసులు  నిందితులు రాజు,మధు,పురుషోత్తంలే చంద్ర‌శేఖ‌ర్ ని హ‌త్య చేశార‌ని తేల్చారు. ఈ నెల 1 న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్లు నిందితులు ముగ్గురు ఒప్పుకున్నారు. 
 
 
తిరుపతి  బాకరపేట అటవీ ప్రాంతంలో చంద్ర‌శేఖ‌ర్ మృత‌దేహాన్ని పడవేసిన ప్రాంతాన్నిపోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఏ పి టూరిజంలో సూపర్ వైజర్ గా విధులు నిర్వహిస్తూ, ఎల్ బి నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఈ  మిస్సింగ్ కేసును హత్య కేసుగా ఎస్ వి యు పోలీసులు తేల్చారు.