1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 24 నవంబరు 2022 (10:51 IST)

తిరుమలను ఓ వ్యాపార కేంద్రంగా మార్చేశారు..: పీఠాధిపతుల ఆరోపణ

Sharada Peetham Swaroopananda Swamy
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను ఓ వ్యాపార కేంద్రంగా మార్చేశారని దాదాపు 30 మంది పీఠాధిపతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నేతలు ధనవంతులకు మాత్రమే శ్రీవారి దర్శనం స్వేచ్ఛగా కలుగుతుందంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వివిధ రాష్ట్రాలకు చెందిన 30 మంది పీఠాధిపతులు శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా తమను మహద్వారం నుంచి దర్శనానికి పంపాలని వారు కోరగా, తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము వస్తున్నట్టు ముందుగా లేఖ రాసినా ఇలా అవమానిస్తారా అంటూ వారు నిరసన వ్యక్తం చేశారు. 
 
ఆ తర్వాత శ్రీనివాస మంగాపురంలో వారు మీడియాతో మాట్లాడుతూ, విజయవాడకు చెందిన శ్రీయోగిపీఠం అధిపతి శ్రీయోగి అతిథేశ్వరానంద పర్వత స్వామి మాట్లాడుతూ, తిరుమలను ఒక వ్యాపార కేంద్రంగా మార్చివేశారన్నారు. 
 
తిరుమలలో కేవలం రాజకీయ నాయకులు, ధనవతులకు మాత్రమే శ్రీవారిని స్వేచ్ఛగా దర్శించుకునే అవకాసం కలుగుతుందన్నారు. సామాన్యులతో తమవంటి పీఠాధిపతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. 
 
తిరుమల పుణ్యక్షేత్రంలో మార్పులు రాకపోతే అఖిల భారత హిందూ మహాసభ ద్వారా తమ భక్తులకు రాజకీయాల్లోకి దింపుతామన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న 900 మంది పీఠాధిపతుల ఆశీర్వాదంతో త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పార్టీని స్థాపిస్తామని ఆయన చెప్పారు. త్వరలోనే తిరుపతిలో బహిరంగ సభను నిర్వహిస్తామని వెల్లడించారు.