1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 మే 2023 (09:05 IST)

వివేకా ఇంటికి మీరెన్ని గంటలకు వెళ్లారు.. ఆ రోజు ఏం జరిగింది.. సీబీఐ ప్రశ్నలు

viveka deadbody
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరిన్ని పక్కా ఆధారాలను సేకరించేందుకు సీబీఐ ముమ్మర కసరత్తు చేసుంది. ఇందులోభాగంగా, వివేకా వ్యక్తిగత సహాయకుడు (పీఏ) కృష్ణారెడ్డి వద్ద మరోమారు ఐదు గంటల పాటు విచారణ జరిపారు. హైదరాబాద్‌లోని  సీబీఐ కార్యాలయంలో ఈ విచారణ జరిగింది. ఇందులో వివేకా హత్య జరిగిన రోజున ఏం జరిగింది? ఆ రోజున వివేకా ఇంటికి మీరు ఎన్ని గంటలకు వెళ్లారు? వెళ్లాక అక్కడ మొదట ఏం చూశారు?, విషయం ఎవరెవరికి చెప్పారు? ముందుగా అక్కడకు వచ్చిందెవరు? ఆ లేఖలే ఏముంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 
 
ఇప్పటివరకు కస్టడీలో ఉన్న నిందితులను ప్రశ్నించిన సీబీఐ.. సాక్షులుగా ఉన్న వారినీ పిలిచి విచారిస్తోంది. ఇప్పుడు కృష్ణారెడ్డి వంతు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు ఐదు గంటలపాటు ప్రత్యేక బృందం కృష్ణారెడ్డిని విచారించింది. హత్య విషయం తెలుసుకున్న వైఎస్ అవినాశి రెడ్డి వివేకా ఇంటికి చేరుకున్న తర్వాత ఏం మాట్లాడారు.. ఏం చేశారని అడిగినట్లు సమాచారం. 
 
'వివేకా గదిలో గుర్తించిన లేఖలో ఏం రాసి ఉంది.. అందులో ఉన్న విషయం మీరు ఎవరెవరికి చెప్పారు? ఎవరి ఆదేశాల మేరకు లేఖ దాచారు.. ఇంట్లో గుర్తించిన సెల్ఫోన్ ఎవరిది' ఇలా అనేక అంశాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.