గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By వాసు
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (15:40 IST)

జగన్ కంటే ఎక్కువ కేసులు ఉన్న వైసీపీ నేత ఈయనే!

వైకాపాలో ఎక్కువ భాగం టికెట్లు నేర చరిత్ర ఉన్న వారికే ఇచ్చారని ప్రతిపక్ష నేతలు ఘోషిస్తున్నారు. అయితే, మొత్తం మీద అందరి కంటే ఎక్కువగా కేసులు ఎదుర్కొంటున్న వైకాపా నేత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనే అందరూ భావిస్తారు.. కానీ ఆయన్ని మించిపోయిన వాళ్లు కూడా పార్టీలో ఉన్నారని తాజా సమాచారం. 
 
వివరాలలోకి వెళ్తే, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన మీద 31 కేసులు ఉన్నాయని పేర్కొంటూ... ఎన్నికల అఫిడవిట్ దాఖలు చేయగా... వైకాపా తరపున పోటీ చేస్తున్న వారిలో అనేక మందిపై పదుల సంఖ్యలో కేసులు ఉన్నప్పటికీ... వీళ్లందరి కంటే ఎక్కువగా 32 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ... ఎన్నికలలో పోటీ చేస్తున్న వ్యక్తి... అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి.
 
సదరు కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఏకంగా 32 క్రిమినల్ కేసులు ఉండగా... ఈ కేసులు 1985 నుండి 2019వ సంవత్సరం వరకు నమోదై ఉన్నాయి. 1987వ సంవత్సరంలోనే పోలీసులు ఆయనపై రౌడీషీట్ తెరిచారు. తుపాకులు, బాంబులతో దాడి చేయడం, కిడ్నాప్, హత్యలు, ఆస్తులను నష్టపరచడం లాంటి పలు కేసులు ఆయనపై ఉన్నాయి. 
 
ఈయనపై ఉన్న కేసుల్లో అత్యధికంగా యల్లనూరు పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యాయి. అయితే, వీటిలో కొన్ని కేసులను కోర్టులు కొట్టివేసాయని కేతిరెడ్డి తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మరి అధినేత కంటే ఎక్కువ కేసులు ఉన్న అభ్యర్థిగా ఈయన రికార్డులకు ఎక్కుతారేమో.