శుక్రవారం, 21 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2024
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2024 (16:25 IST)

జనసేన పార్టీకి షాక్... ఫ్రీ సింబల్‌గా జనసేన గుర్తు గాజు గ్లాసు

glass symbol
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి ప్రారంభమైంది. మొత్తం ఏడు దశల్లో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశ పోలింగ్ ఈ నెల 19వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరి తదిత రాష్ట్రాల్లో జరుగనుంది. అలాగే, ఏపీలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరుగనుంది. ఈ నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం ఏపీలో సీఈవో ఈ జాబితాను విడుదల చేశారు. 
 
గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైకాపా, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయి. దీంతో వైకాపాకు ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తులను కేటాయించారు. అయితే, రిజిస్టర్ పార్టీల జాబితాలో జనసేన పార్టీ ఉంది. ఈ పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈసీ ఉంచింది. ఈ నిర్ణయం జనసేనను కలవరపాటుకు గురిచేస్తుంది. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తామని, ఇందుకోసం న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని భావిస్తున్నట్టు జనసేన పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

పిఠాపురం ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రార్థనలు!! 
 
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసే పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత మూడు రోజులుగా పర్యటిస్తున్నారు. నాలుగో రోజైన మంగళవారం ఆయన పర్యటిస్తున్నారు. ఆయన ఆంధ్రా బాప్టిస్ట్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల తర్వాత యు.కొత్తపల్లి మండలం పొన్నాడలో ఉన్న బషీర్ బీబీ దర్గాను సందర్శించారు. చర్చిలోనూ, దర్గాకు వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత ఆయన ఉప్పాడ కొత్తపల్లిలో మహిళలతో సమావేశమయ్యారు. కాగా నాలుగో రోజు పర్యటనలో పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. 
 
పవన్ కళ్యాణ్ తన పర్యటనను ముగించుకుని బుధవారం తెనాలికి బయలుదేరి వెళతారు. ఆ తర్వాత ఈ నెల 4వ తేదీన నెల్లిమర్ల, 5వ తేదీన అనకాపల్లి, 6వ తేదీన యలమంచిలి, 7వ తేదీన పెందుర్తి, 8వ తేదీన కాకినాడ నియోకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. 9వ తేదీన ఉగాది పర్వదినం సందర్భంగా తిరిగి పిఠాపురంకు వచ్చిన ఆ నియోజకవర్గ ప్రజలతో కలిసి ఆయన ఉగాది వేడుకలను జరుపుకుంటారు. పిమ్మట 10వ తేదీన రాజోలు, 11వ తేదీన గన్నవరం, 12వ తేదీన రాజానగరం బహిరంగ సభల్లో పాల్గొంటారు.