1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (14:20 IST)

నిన్న తెలుగు - నేడు హిందీ - ఏపీలో కొనసాగుతున్న ప్రశ్నపత్రాల లీక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. బుధవారం తొలి పరీక్ష తెలుగు జరిగింది. అయితే, ఈ పరీక్ష ప్రారంభానికి ముందే ప్రశ్నపత్రం లీకైంది. రెండో రోజైన గురువారం హిందీ ప్రశ్నపత్రం లీకైంది. 
 
తొలి రోజున చిత్తూరు, నంద్యాల జిల్లాల్లో తెలుగు ప్రశ్నపత్రం లీకై వాట్సాప్‌లో ప్రత్యక్షమైంది. అయితే, ఈ వార్తలను ఏపీ విద్యా శాఖ అధికారులు కొట్టిపారేశారు. తెలుగు ప్రశ్నపత్రం లీక్ కాలేదనీ, వదంతులు నమ్మొద్దంటూ డీఈవో, కలెక్టర్ ప్రకటించారు. 
 
అయితే, చిత్తూరు జిల్లాలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై అధికారులు విచారణ జరుపగా, గిరిధర్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు ఈ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్ గ్రూపులో షేర్ చేసినట్టు తేలింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఇదిలావుంటే, రెండో రోజైన గురువారం రెండో పరీక్ష హిందీ మొదలైన కొద్దిసేపటికే ఈ ప్రశ్నపత్రం లీకైంది. శ్రీకాకుళం జిల్లా సరబుజ్జలి మండలం కొట్టవలస పరీక్షా కేంద్రంలో హిందీ పేపర్ లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి. 
 
పరీక్ష ప్రారంభమైన కాపేసటి తర్వాత ప్రశ్నపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనిపించడంతో అధికారులు విచారణ మొదలుపెట్టారు. మరోవైపు, తొలి పరీక్ష నుంచే ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.