1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2022 (12:09 IST)

మంత్రులంటే కూరలో కరివేపాకులా: సీఎం జగన్ మాటల్లో పరమార్థం?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులను కూరలో కరివేపాకులా భావిస్తున్నారా?. అందుకే ఆయన మంత్రులను అంత చులకనగా చూస్తున్నారా? మంత్రుల కంటే పార్టీ జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయకర్తలే గొప్ప అంటూ వ్యాఖ్యానించడానికి కారణం అదేనా?. పైగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచి తిరిగి అధికారంలోకి వస్తే మంత్రులగా పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా సమన్వయకర్తలకే మంత్రి పదవులు కట్టబెడుతానంటూ ఇపుడే ప్రకటించేశారు. దీంతో ప్రస్తుత మంత్రుల గుండెల్లో బాంబు పేల్చారు. 
 
తాడేపల్లి ప్యాలెస్‌‍లో ముఖ్యమంత్రి జగన్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, మంత్రులతో కీలక సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ముఖ్యంగా, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచి తిరిగి అధికారంలోకి వస్తే జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వకర్తలు 25 మంది మళ్లీ మంత్రులవుతారని తేల్చి చెప్పారు. మంత్రులు రెండు రోజులు మాత్రమే తమ శాఖల బాధ్యతలను చూడాలని.. మిగిలిన ఐదు రోజులు నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆదేశించారు. 
 
ఎమ్మెల్యేలు, మంత్రులు రోజుకు రెండు, మూడు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించారు. తాను కూడా త్వరలోనే.. సచివాలయాలను సందర్శిస్తానని, జిల్లాల్లో పర్యటిస్తానని జగన్‌ వెల్లడించారు. మళ్లీ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించాలన్నారు. 
 
పార్టీ అధ్యక్షుడు, సమన్వయకర్తల తర్వాతే మంత్రులని జగన్‌ స్పష్టం చేశారు. ఎవరికైనా పార్టీయే సుప్రీమ్‌ అని తెలిపారు. జూలై 8వ తేదీన వైఎస్‌ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా పార్టీ ప్లీనరీ నిర్వహిస్తామన్నారు.
 
కాగా, వైసీసీ జిల్లా అధ్యక్షులకు జిల్లా అభివృద్ధి మండలి ఛైర్మన్‌ పదవులు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. వారికి కేబినెట్‌ హోదా కల్పిస్తూ త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని ఈ సమావేశంలో ఆయన వెల్లడించారు.