శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 మార్చి 2017 (10:57 IST)

పదో తరగతి పరీక్షా పేపర్ల లీకు వ్యవహారం.. వైకాపాకు లింకు పెట్టిన నారాయణ..

పదో తరగతి పరీక్షా పేపర్ల లీకు విషయం అసెంబ్లీని కుదిపేసింది. పరీక్షా పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ-

పదో తరగతి పరీక్షా పేపర్ల లీకు విషయం అసెంబ్లీని కుదిపేసింది. పరీక్షా పేపర్ల లీకేజీకి బాధ్యత వహిస్తూ మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి నారాయణ రాజీనామా చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ-గంటా శ్రీనివాసరావు ఇద్దరు వియ్యంకులు కావడంతో లీకేజీల గుట్టును కప్పిపుచ్చుతున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. 
 
నారాయణ విద్యాసంస్థల అధినేత ప్రభుత్వ నేత కావడంతోనే ఈ ఆరోపణలపై కంటితుడుపు విచారణతో సరిపెట్టారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. లీకులు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన చోట్ల పలువురు ఇన్విజిలేటర్లను, ఇతర సిబ్బందిని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సస్పెండ్ చేశారు.
 
నెల్లూరులోని నారాయణ స్కూల్ నుంచి పదోతరగతి సైన్స్ పేపర్-1ను శనివారం నాడు వాట్సాప్ ద్వారా లీకేజీ చేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో చీఫ్ సూపరిండెంట్, సంబంధిత అధికారిపై వేటు వేసిన విద్యాశాఖ దీని వెనుక ఎవరున్నారనే దానిపై సమగ్ర విచారణ చేపట్టలేదనే ఆరోపణలు కూడా వచ్చాయి.
 
అయితే పేపర్ల లీకుకు వైకాపాకు మంత్రి నారాయణ లింకు పెట్టారు. టెన్త్ పేపర్ లీక్ కాలేదని, లీకైనట్లు వస్తున్న ఆరోపణల వెనుక ప్రతిపక్షం వైసీపీ కుట్ర ఉందని  నారాయణ ఆరోపించారు. లీకులు జరిగినట్లు వస్తున్న వార్తలన్ని అవాస్తవమని, ఎవరైనా లీకులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చామని అన్నారు. అయితే పరీక్షా పేపర్ల లీకేజీలు జరిగాయని ప్రతిపక్షం వైసీపీ బలంగా వాదిస్తోంది. వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టెన్త్ పేపర్ లీకేజీపై సీఐడీతో దర్యాప్తు చేయించాలన్నారు.