గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 7 ఏప్రియల్ 2019 (11:54 IST)

పోలవరం ఆపేందుకు భారీకుట్ర.. జగన్ స్నేహం పులిమీద స్వారీ లాంటిది : హీరో శివాజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జీవనాడిలాంటి పోలవరం జాతీయ ప్రాజెక్టును ఆపేందుకు భారీ కుట్ర జరుగుతోందని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. ఆయన నిజం విత్ శివాజీ పేరుతో ఆదివారం మీడియాతో మాట్లాడారు. 
 
ఈ సందర్భంగా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయని.. ఒకవేళ కేసీఆర్‌ అనుకూల ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోవడం ఖాయమన్నారు. పైగా, రాజధాని సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కేసీఆర్, మోడీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో జగన్ స్నేహం పులిమీద స్వారీ లాంటిదన్న శివాజీ.. అలాంటి స్నేహం ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. 
 
'పక్కరాష్ట్రంలోని కొంతమంది ఏపీపై పగబట్టారు. వారి ఎత్తులను ఏపీ ప్రజలు చిత్తు చేయాలి. వారి కుట్రలను బద్దలుగొట్టకపోతే మనకు మనమే అన్యాయం చేసుకున్నవాళ్లమవుతాం. అందుకే.. సరైన నేతను ఎంచుకోండి' అని శివాజీ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల తరఫున కాకుండా ప్రజల తరపున ప్రశ్నిస్తున్నానన్న ఆయన.. ప్రశ్నించే వాడికి కులం అంటగుడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇక.. రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్స్‌ అని జగన్‌ వ్యాఖ్యానించడంపై శివాజీ అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో జగన్‌ ఇంటికే మూడున్నరేళ్లు పడితే ఇంతపెద్ద రాజధాని నిర్మాణానికి ఆ మాత్రం సమయం పట్టదా? అని ప్రశ్నించారు. 
 
ఏపీ ప్రభుత్వంపై, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారంలో నిజమెంత ఉందో బయటపెట్టేందుకే మీడియా ముందుకు వచ్చానన్న శివాజీ.. పోలవరంలో ఒక్క ఇటుక కూడా పడలేదన్న వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. చెప్పేదానికంటే కళ్లతో చూస్తేనే నిజాన్ని నమ్ముతారన్న ఉద్దేశంతో పోలవరంలో ఏం జరుగుతోందో స్వయంగా అక్కడికి వెళ్లి తెలుసుకున్నానంటూ ది ట్రూత్ పేరుతో తీసిన వీడియోను మీడియా ఎదుట ప్రదర్శించారు.