1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (07:44 IST)

చంద్రబాబుకు హ్యాండిచ్చిన తెదేపా ఎమ్మెల్సీలు.. పొంచివున్న అనర్హత గండం?

తెదేపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు తేరుకోలేని షాకిచ్చారు. మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టినపుడు ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఈ ఇద్దరిపై అనర్హత వేటుపడనుంది. 
 
మూడు రాజధానుల బిల్లులు శాసనమండలిలో మంగళవారం సీఎం జగన్ సర్కారు ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా టీడీపీ విప్ జారీ చేసింది. అయితే, ఈ విప్‌ను ధిక్కరించిన వీరిద్దరు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. వీరిలో ప్రకాశం జిల్లాకు చెందిన పోతుల సునీత, కడప జిల్లాకు చెందిన శివనాథ రెడ్డిలు ఉన్నారు. 
 
శివనాథ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్న కుమారుడు కావడం గమనార్హం. మరోవైపు, పోతుల సునీత కూడా మంగళవారం మధ్యాహ్నమే పార్టీ మారబోతున్నట్టు సంకేతాలు పంపించింది. స్థానికంగా తమకు అనేక ఇబ్బందులు ఉన్నాయనీ, వీటిని అధికమించాలంటే తాము పార్టీ మారక తప్పడం లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఇద్దరు సభ్యులకు అనర్హత వేటు గండం పొంచి ఉంది.