గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (15:16 IST)

ప్రిన్స్ మహేష్ బాబుకు అమరావతి సెగ... మద్దతు కోరుతూ ధర్నా

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు అమరావతి రాజధాని సెగ తగిలింది. హైదరాబాద్ నగరంలో ఉన్న మహేష్ ఇంటి ముందు ముగ్గురు విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు తక్షణం స్పందించి, ఆ ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. 
 
శుక్రవారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని విశాఖపట్టణంకు తరలించాలని నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. వీరికి ఒక్క వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణ మద్దతునుప్రకటించాయి. 
 
గత 24 రోజులుగా సాగుతున్న ఆందోళలతో అమరావతి గ్రామాలు అట్టుడుకి పోతున్నాయి. ఇపుడు ఈ సెగ హైదరాబాద్‌ను తాకింది. శుక్రవారం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఏపీ రాజధాని కోసం నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని ఫిలింనగర్‌లో జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ వారు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి అధ్యక్షుడు షేక్ జిలాని మీడియాతో మాట్లాడుతూ, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో, వైజాగ్‌లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని కోరారు. 
 
కాగా, ఈ ధర్నాకు దిగిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మహేష్ ఇంటి ముందు ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే, ఈ వ్యవహారంపై మహేష్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.