గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు
కేంద్ర రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెందిరింపు రావడం మహారాష్ట్రలోని నాగ్పూర్లో తీవ్రకలకలం సృష్టించింది. ఓ అగంతకుడు ఆదివారం ఫోన్ చేసి, గడ్కరీ ఇంట్లో బాంబు పెట్టినట్టు బెదిరించాడు. ఈ సమాచారంతో నగర పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి ఇంటి పరిసరాలను గాలించాయి.
అలాగే, సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు తనిఖీ బృందాలు గడ్కరీ నివాసానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని ఇంటి ఆవరణతో పాటు లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడ పట్టినా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యంకాలేదు. దీంతో పోలీసులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇది కేవలం ఓ అకతాయి చేసిన నకిలీ కాల్గా గుర్తించారు.
మరోవైపు, ఈ బాంబు బెదిరింపును పోలీసులు చాలా సీరియస్గా తీసుకుని, ఫోన్ నంబరు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు కొద్ది వ్యవధిలోనే నిందితుడు ఆచూకీని కనుగొన్నాయి. నాగ్పూర్లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న మద్యం దుకాణంలో పని చేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్గా నిందితుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడు ఎందుకు ఈ బెదిరింపి కాల్ చేశాడనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.