శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఉత్తుత్తి ఉత్తరంలో పెద్దపెద్ద డైలాగులు లేవే..!? అంబటి రాంబాబు

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీపై చంద్రబాబు నాయుడు ఉత్తరం రాశారంటే.. ఏం రాశారా అని చూశాం. రెండున్నర పేజీల ఉత్తరంలో రెండు పేజీలు విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ జరిగిన ఉద్యమం గురించి రాశారేగానీ మరో మాట ప్రస్తావించలేదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. 
 
మూడో పేజీ మొదటి పేరాలో నష్టాలు ఎందుకు వస్తున్నాయో అందరికీ తెలుసు అని రాశారు. చివరి వాక్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన  ప్రత్యామ్నాయాలు ఉంటే చూడండి అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ రాశారంటే, మోడీకన్నా సీనియర్ అయిన చంద్రబాబు బ్రహ్మాండం ఏదో బద్ధలు కొట్టారని అనుకున్నాం. పోనీ మొన్న విశాఖపట్నం వెళ్ళి నడిరోడ్డు మీద తెలుగులో చెప్పిన డైలాగుల్లో ఏ ఒక్కటైనా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారేమో అని చూశాం. 
 
"అమ్మటానికి వాడెవ్వడు - కొనటానికి వీడెవ్వడు.." అని రోజూ మోగుతున్న చంద్రబాబు, ఆయన బృందం ఈ మాట ఉత్తరంలో రాశారేమో అని చూశాం. ఏ ఒక్కటీ లేదు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటానికి వీలే లేదు అని ఒక్క వాక్యం కూడా రాయలేదు. 
 
ప్రత్యామ్నాయాలను సూచించినదీ లేదు. ప్రత్యామ్నాయాలు సూచిస్తూ ముఖ్యమంత్రి జగన్ చేసిన విజ్ఞప్తికి మద్దతు పలికిందీ లేదు. ఇంతవరకు చంద్రబాబు ఎందుకు ఉత్తరం రాయలేదు అని అడిగినందుకు.. ఉత్తుత్తిగా తెల్ల కాగితం మీద సంతకం పెట్టిచ్చినట్టు ఉంది చంద్రబాబు ఉత్తరం అంటూ ఎద్దేవా చేశారు.