1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 మే 2022 (07:32 IST)

ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

mekapati goutham reddy
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 30వ తేదీ నోటిఫికేషన్ జారీ అవుతుండగా, జూన్ 23న పోలింగ్, జూన్ 26న ఎన్నిక ఫలితాన్ని వెల్లడిస్తారు. 
 
వైకాపా నేత, మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాత్మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. ఆత్మకూరుతో పాటు దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దేశంలో 3 పార్లమెంట్‌, 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నిక నిర్వహించనున్నారు. 
 
ఇటీవల మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆయన తనయుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. రాజమోహన్‌రెడ్డి పెద్ద కుమారుడైన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ టికెట్‌ను గౌతమ్‌రెడ్డి భార్యకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. 
 
అయితే తన రెండో కొడుకు విక్రమ్‌రెడ్డికి ఇవ్వాలని రాజమోహన్‌రెడ్డి ఆయన్ను కోరినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పటివరకు ఆత్మకూరు టీడీపీ అభ్యర్థిపై ఎలాంటి చర్చ జరగలేదు. ఆత్మకూరు నుంచి పోటీ చేస్తామని టీడీపీ ఇప్పటివరకు ప్రకటించలేదు. బీజేపీ మాత్రం తమ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.