మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (12:32 IST)

గుంటూరు జిన్నా టవర్ పేరు మార్పునకు బీజేపీ డెడ్‌లైన్

jinna tower
గుంటూరు జిల్లా కేంద్రంలోని జిన్నా టవర్ పేరును మార్చాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పేరు మార్పు కోసం తాజాగా డెడ్‌లైన్ విధించారు. లేనిపక్షంలో ఆ టవర్‌ను కూల్చివేస్తే తమకు ఎలాంటి సంబంధం లేదని వారు ప్రభుత్వానికి స్పష్టం చేశారు. అయితే, ఇన్నేళ్లు నోరు మెదపని బీజేపీ నేతలు ఇపుడు జిన్నా టవర్‌పై మాట్లాడటమేమిటని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
జిల్లా కేంద్రమైన గుంటూరులోని ముఖ్యమై జంక్షన్లలో జిన్నా టవర్ కూడలి ఒకటి. శాంతిచిహ్నంగా కుతుబ్‌మినర్ తరహాలో ఈ టవర్‌ను గత 1942లో నిర్మాణం చేపట్టి 1945లో పూర్తి చేశారు. ఈ టవర్ ప్రారంభోత్సవానికి మహ్మద్ అలీ జిన్నాను స్థానికులు ఆహ్వానించారు. అయితే, ఆయన అనివార్య కారణాలతో ఈ టవర్ ప్రారంభోత్సవానికి హాజరుకాలేదు. తన ప్రతినిధిగా జుదాలియాఖత్ అలీఖాన్‌ను పంపించారు. అప్పటి నుంచి ఈ టవర్‌ను జిన్నా టవర్‌గా పిలుస్తున్నారు. 
 
ఇలా ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ఈ టవర్ ఇపుడు వివాదాల్లో చిక్కుకుంది. నాడు భారతదేశ విభజనకు కారకుడైన జిన్నా పేరు దేశంలోని కట్టడాలకు ఉండరాదనే వాదనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీంతో ఈ టవర్‌కు పేరు మార్చాలని కోరుతూ గుంటూరు నగర పాలక కమిషనర్‌కు ఓ వినతిపత్రం ఇచ్చింది. 
 
జిన్నా పేరును తొలగించి దేశ అభ్యున్నతికి పాటుపడిన అబ్దుల్ కలాం, దేశం కోసం ప్రాణాలు అర్పించిన హమీద్, ప్రఖ్యాత సాహితీవేత్త గుర్రం జాషువా వంటి ఎందరో మహనీయుల పేరులు పెట్టాలని వారు కోరుతున్నారు. అయితే, దీనిపై అటు గుంటూరు కార్పొరేషన్, ఇటు ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఈ టవర్ పేరు మార్చాలని కోరుతూ బీజేపీ నేతలు డెడ్‌లైన్ విధించారు. లేనిపక్షంలో ఈ టవర్ కూల్చివేసిన పక్షంలో తమకు ఎలాంటి సంబంధం లేదని హెచ్చరించారు.