మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 మే 2022 (17:06 IST)

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలి : నారా లోకేశ్

nara lokesh
అధికార వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై సీబీఐతో విచారణ జరిపించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన సోమవారం విజయవాడలో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌పై కేసు నమోదు చేసి 72 గంటలు గడుస్తున్నా ఎందుకు అరెస్టు చేయలేదని పోలీసులను ప్రశ్నించారు.
 
కేసు నుంచి తప్పించుకునేందుకు ఎమ్మెల్సీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారని లోకేష్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఓదార్చనందుకు హోంమంత్రి టి.వనితపై ఆయన మండిపడ్డారు.
 
మరోవైపు, నారా లోకేష్ సోమవారం విజయవాడ మొదటి అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. గత 2020లో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఆ సమయంలో కోవిడ్ నిబందనలు అమల్లోవున్నాయి. 
 
ఈ నిబంధనలను నారా లోకేష్ ఉల్లంఘించారంటూ ఆయనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా వచ్చారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రహదారులను దిగ్బంధించిన పోలీసులు టీడీపీ నేతలు, శ్రేణులను కోర్టు ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసుల వైఖరిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
ఈ సందర్భంగా నారా లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, వైఎస్ రాజారెడ్డి రాసిన రాజ్యాంగం పక్కాగా అమలవుతుందంటూ మండిపడ్డారు. ఇప్పటికే 55 మంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వంతో చేసే పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదన్నారు.