బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (15:31 IST)

ఏపీని బీహార్ కంటే దారుణంగా మార్చేశారు : నారా లోకేశ్ ధ్వజం

nara lokesh
సీఎం జగన్ రెడ్డి తన చేతిగాని పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్ కంటే దారుణంగా మార్చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. గుంటూరు జిల్లాలో నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో తొమ్మిదో తరగతి చదివే బాలిక సామూహిక అత్యాచారానికి గురైంది. 
 
అలాగే, కాకినాడ జిల్లాలో వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు వద్ద కారు డ్రైవర్‌గా పని చేస్తూ వచ్చిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం శవమై తేలాడు. ఈ శవాన్ని తన కారులోనే మృతుని ఇంటికి ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తీసుకెళ్లి అప్పగించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
అర్థరాత్రి పూట రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పిన ఎమ్మెల్సీ స్వయంగా ఆయనే తన కారులో తెల్లవారుజామున 2 గంటలకు డ్రైవర్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. డ్రైవర్ తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో బాడీని అక్కడే వదిలేసి మరో కారులో అనంత ఉదయ్ బాబు వెళ్లిపోయారు. ఈ రెండు ఘటనపై నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు నెలకొనివున్నాయన్నారు. 
 
వైకాపా నాయకుల నేరాలు, ఘోరాలకు సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన వద్ద డ్రైవరుగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యంను అత్యంత దారుణంగా హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ బాబు ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస క్రీడకు అద్దం పడుతోందని మండిపడ్డారు.