ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 అక్టోబరు 2021 (16:22 IST)

హైకోర్టు వద్ద ధూళిపాళ్ళ దంపతుల ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వద్ద ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అయితే, దీనిని గమనించిన కోర్టు సెక్యూరిటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బాధితులు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల గ్రామస్థులుగా గుర్తించారు. ఇంటి వివాదంలో కొందరు తమను ఇబ్బంది పెడుతున్నారని బాధిత దంపతులు చెప్పినట్లు తెలుస్తోంది.
 
ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్రరావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు వ్యక్తులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఒంటిపై డీజిల్ పోసుకున్నారు. వారి ప్రయత్నాన్ని గమనించిన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది.. దంపతులను వెంటనే అడ్డుకున్నారు. వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని తుళ్లూరు స్టేషన్​కు తరలించారు. 
 
గత 2003 నుంచి తమకు ఉన్న స్థలంలో నివాసం ఉంటున్నామని.. 2017లో బస్సు షెల్టర్ నిర్మాణానికి బలవంతంగా లాక్కొనేందుకు యత్నించగా తాము హైకోర్టును ఆశ్రయించామని బాధితుడు దేవేంద్ర చెప్పారు. హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా.. గ్రామంలో కొంత మంది పెద్దలు తమను నిత్యం వేధిస్తున్నారని వాపోయారు. దీంతో విసుగు చెంది హైకోర్టు వద్దే ఆత్మహత్య చేసుకుందామని అక్కడికి వచ్చినట్లు దంపతులు వాపోయారు.