గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

గుడివాడ డివిజన్ పరిధిలో ఫిబ్రవరి 2న నామినేషన్ల స్వీకరణ

గుడివాడ డివిజన్ పరిధిలో రెండోవిడతలో నిర్వహించు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయని జాయింట్ కలెక్టరు (ఆసరా) కె.మోహన్ కుమార్ అన్నారు. స్థానిక కేటీఆర్ ఉమెన్స్ కళాశాలలో శనివారం గుడివాడ డివిజన్ పరిధిలోని స్టేజ్-1 ఆఫీసర్లకు, యంపీడీఓలకు శిక్షణా తరగతులకు ముఖ్య అతిథిగా జాయింట్ కలెక్టరు మోహన్ కుమార్ హాజరయ్యారు. 
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుడివాడ డివిజన్ పరిధిలోని 211 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను జనవరి 31న విడుదల చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రక్రియకు తక్కువ సమయం ఉన్నందున అధికారులు నిబద్ధతతో పారదర్శకంగా విధులు నిర్వహించాలన్నారు. ఎన్నికల విధులను బాధ్యతతో నిర్వహించాలని ఈ విషయం పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టమైన సూచనలు చేయడం జరిగిందన్నారు. 
 
నామినేషన్లు స్వీకరణ, పరిశీలన, తిరస్కరణ, ఉపసంహరణ వంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూలును విడుదల చేశామన్నారు. ఫిబ్రవరి 2 నుండి 4వ తేదీ వరకూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలన్నారు. ఫిబ్రవరి 5 వ తేది నామినేషన్ల పరిశీలన, 6వ తేదీ సక్రమంగా లేని నామినేషన్ల తిరస్కరణకుగురైన వారు అప్పీలేట్ అథారిటీ అయిన గుడివాడ ఆర్డీవో పరిశీలిస్తారన్నారు. 
 
7వ తేదీన తిరస్కరించబడిన ధరఖాస్తులను సంబంధిత అప్పీలేట్ అధారిటీ పరిష్కరిస్తుందన్నారు. ఫిబ్రవరి 8వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందన్నారు. అనంతరం సంబంధిత ఆర్ఓలు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల పరకు ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. తదుపరి అదేరోజు సాయంత్రం 4 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియను చేపట్టడం జరుగుతుందన్నారు. 
 
కౌటింగ్ పూర్తి అయిన తర్వాత ఫలితాలను ప్రకటించడం జరుగుతుందని, అనంతరం ఉప సర్పంచ్ ఎంపికకు ఓటింగ్ నిర్వహిస్తామన్నారు. ఎన్నికల విధులకు, శిక్షణా తరగతులకు గైర్హాజరు అయిన అధికారులు, సిబ్బందిపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. నిబద్ధతతో విధులు నిర్వహించేవారు, ఎటువంటి ఆందోళనకు భయాలకు గురికావద్దన్నారు. 
 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల, ఆదాయ, నివాస, తదితర ధృవ పత్రాలు జారీలో జాగ్రత్తతో వ్యవహరించాలని జాయింట్ కలెక్టరు మోహన్ కుమార్ తెలిపారు. అభ్యర్థుల నుంచి ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ఎటువంటి పొరపాట్లు జరిగినా సంబంధిత అధికారులపై ఎన్నికల కమిషన్ చేపట్టే చర్యలకు బాధ్యత వహించాల్సిఉంటుందన్నారు. 
 
గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల నుండి డిపాజిట్ మొత్తాలను తప్పని సరిగా వసూలు చేయాలని  తెలిపారు.  ఇందుకోసం రాష్ట్ర ఎన్నికల కమిషప్ స్పష్టమైన సూచనలు చేయడం జరిగిందన్నారు. యస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు రూ.1500 లు, వార్డు మెంబర్లు రూ.500లు డిపాజిట్ గా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు కాకుండా పోటీ చేసే ఇతర సర్పంచ్ అభ్యర్థులు రూ.3000లు, వార్డు మెంబర్లు రూ.1000లు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందన్నారు. 
 
గుడివాడ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ బూత్‌లను వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఒకటికి రెండుసార్లు ఎన్నికల మార్గదర్శకాలను చదవడం ద్వారా పూర్తి అవగాహన కలుగుతుందన్నారు. సందేహాల నివృత్తికోసం జిల్లాస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ సమయంలో పోలీసు సహకారాన్ని తప్పనిసరిగా తీసుకోవలన్నారు. పదివేలు జనాబా పైబడిన గ్రామాలకు రిటర్నింగ్ అధికారిని నియమించడం జరగుతుందన్నారు. 
 
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలను ఎన్నికల కమీషన్  అందించిన విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టరు(ఆసరా) మోహన్ కుమార్ అన్నారు. శిక్షణా కార్యక్రమంలో ఆర్డీవో జి. శ్రీనుకుమార్, డీపీవో సాయిబాబా, డీఎల్పీవో నాగిరెడ్డి,  శిక్షణా భోదకుడు ఏఎస్ఓ ప్రసాద్ డివిజన్ పరిదిలోని యంపీడివోలు తదితరులు పాల్గొన్నారు.