1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 మార్చి 2022 (11:37 IST)

పిల్లి కాటుకు ఇద్దరు మహిళలు మృతి.. తర్వాత పిల్లి కూడా...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములవాడలో విషాదం చోటుచేసుకుంది. పిల్లి కాటుకు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ పిల్లి కూడా మృత్యువాతపడింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వేములవాడ గ్రామంలోని దళితవాడకు చెందిన రిటైర్డ్ కండక్టర్ సాలి భాగ్యారావు అనే వ్యక్తి భార్య కమల, ఇదే గ్రామానికి చెందిన ప్రైవేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం ఓ పిల్లి కరిచింది. వైద్యుల సలహా మేరకు వారిద్దరూ టీటీ ఇంజెక్షన్లు వేయించుకున్నారు. గాయాలు తగ్గేందుకు మందులు కూడా వాడారు.
 
ఇంతవరకు బాగానే వుంది. కానీ, నాలుగు రోజుల క్రితం వారిద్దరూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వారిద్దరిని మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. అక్కడ చికిత్స పొందుతూ వచ్చిన వారిద్దరిలో నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందగా, శనివారం ఉదయం 10 గంటలకు మరణించింది. పిల్లి కరవడంతో వీరిద్దరీ ర్యాబిస్ వ్యాధి సోకిందని అందుకే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారని వైద్యులు తెలిపారు. అలాగే, ఇద్దరు మహిళలను కరిచిన పిల్లి కూడా మరణించిందని గ్రామస్తులు తెలిపారు.