శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:46 IST)

త్వరలో ఆహార శుద్ధి విధానం ప్రకటన: మంత్రి కురసాల కన్నబాబు

రాష్ట్రంలో త్వరలో ఆహార శుద్ధి విధానాన్ని ప్రకటించడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.

గురువారం అమరావతి సచివాలయంలోని త‌న కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తన పాదయాత్రలో రైతాంగ సమస్యలను తెల్సుకున్న సియం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే రైతు సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా పెట్టుకుని అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను శరవేగంగా అమలుచేయండ జరుగుతోందని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఆయిల్ ఫామ్ రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుని వెంటనే రూ.80కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందని చెప్పారు. ఆయిల్ ఫామ్ రైతులకు ఏవిధంగా మెరుగైన ధర అందించాలనే దానిపై ప్రత్యేక దృష్టిపెట్టి రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా టన్నుకు రూ.10,074గా  ఉన్న ధరను రూ.11వేలకు పెంచడం జరిగిందని తెలిపారు.

తెలంగాణా రాష్ట్రంలో టన్నుకు రూ.10,903 ధర చెల్లిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.భవిష్యత్తులో ఆయిల్ ఫామ్ రైతుకు మరింత ప్రయోజనం కల్పించే లక్ష్యంతో ఈరైతులకు కనీస మద్ధత్తు ధర ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సియం జగన్మోహన్ రెడ్డి లేఖ వ్రాశారని మంత్రి కన్నబాబు వివరించారు.  

త్వరలో పుడ్ ప్రాసెసింగ్ పాలసీని ప్రకటించబోతున్నామని ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి జనగ్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించారని మంత్రి కన్నబాబు వెల్లడించారు.దానిలో కొన్ని మార్పులు సూచించారని వాటిని ఆవిధానంలో చేర్చడం జరుగుతోందని తెలిపారు.

రబీ ధాన్యం సేకరణ ఇతర వ్యవసాయ పంటలపై శుక్రవారం సియం సమీక్షించనున్నారని చెప్పారు. నెల్లూరు జిల్లాల్లో ధాన్యం సేకరణకు సంబంధించి కొన్ని ఇబ్బందులు వచ్చాయని వాటిని పరిష్కరించడం జరుగుతోందని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేయడం జరుగుతోందని అన్నారు.

రైతు భరోసా కేంద్రాలకు గోదాములు అందుబాటులో ఉండేలా గోదాములు నిర్మాణం వాటిలో అవసరమైన మౌళిక సదుపాయాలు, ఇతర పరికరాలు తదితర ఏర్పాటుకై రూ.5,500 కోట్ల రూ.6వేల కోట్లతో ఒక ప్రణాళికను రూపొందించడం జరుగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. ప్రభుత్వపరంగా ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో పుడ్ ప్రాసెసింగ్ విధానం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయపరమైన మౌళిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు.