శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (07:38 IST)

ఏపీలో ప్రైవేటు స్కూళ్లకు మరో షాక్..!!

ఏపీలో ప్రైవేటు విద్యాసంస్ధల ఆగడాలను అరికట్టేందుకు వీలుగా కొన్ని కీలక చర్యలు తీసుకోవాల్సిందేనని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

ఈ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేస్తే దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలలకు చుక్కలు కనిపించడం ఖాయంగా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల తీరుపై గుర్రుగా ఉన్న విద్యా కమిషన్ పలుమార్లు హెచ్చరికలు చేసినా ప్రయోజనం లేకపోవడంతో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఈ సిఫార్సులు చేసింది.
 
ప్రైవేటు స్కూళ్లపై ఫిర్యాదుల పర్వం...
ఏపీలో కరోనా నేపథ్యంలో దాదాపు అన్ని ప్రైవేటు విద్యాసంస్ధలు టీచర్లకు జీతాలు ఇవ్వకపోవడం లేదా తొలగించడం చేస్తున్నాయి.

వీటి ఆగడాలను అడ్డుకోవాలని కోరుతూ పలువురు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు విద్యా కమిషన్ ను కోరాయి. ఇప్పటికే టీచర్లను అడ్మిషన్ల కోసం విద్యార్ధుల ఇళ్లకు పంపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడుతున్న విద్యాసంస్ధల గుర్తింపు రద్దు చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసిది. అయితే వీటిని ప్రైవేటు స్కూళ్లు పెడచెవిన పెడుతున్నాయి.

దీంతో కమిషన్ వీటిపై సీరియస్ అయింది. కొన్ని ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలుఅనధికారికంగా టీచర్లను తొలగించడం చట్ట వ్యతిరేకమని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు తెలిపారు.

ఆ ఆధికారం వారికి లేదు..
1982 విద్యా చట్టం ప్రకారం క్రమశిక్షణకు సంబంధించి ఎలాంటి విచారణ చేపట్టకుండా ఉపాధ్యాయులను తొలగించే అధికారం యాజమాన్యాలకు లేదని తెలిపారు. గడచిన నాలుగు నెలలుగా ఉపాధ్యాయులకు జీతభత్యాలు ఇవ్వకపోవడం మరియు రాతపూర్వక ఉత్తర్వులు లేకుండా ఉపాధ్యాయులను తొలగించడం తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు.

ఒకవేళ ఉపాధ్యాయులను తొలగించాలన్నా అందుకు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలని, తొలగించాల్సిన పరిస్థితి వస్తే చట్ట ప్రకారం వారికి పరిహారం ఇవ్వాలని ఇది కూడా ఉన్నతాధికారుల ఆదేశానుసారం చేయాలని చట్టం చెబుతోందన్నారు.

అలాగే ప్రైవేటు విద్యా సంస్థలు ప్రతి నెలా తమ సిబ్బందికి జీతాలు ఇవ్వాలని తెలిపారు. దీన్ని ఉల్లంఘించే ప్రైవేటు యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని కూడా చట్టం చెబుతున్నట్లు వివరించారు.

సర్కారుకు కీలక సిఫార్సులు....
చట్టాన్ని వరుసగా ఉల్లంఘించే విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని, సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల పాటు సంబంధిత యజమానికి జైలు శిక్ష విధించవచ్చని, జరిమానా వేయవచ్చని చట్టంలో స్పష్టంగా ఉందని తెలిపారు. కాబట్టి ప్రైవేటు విద్యాసంస్థలు జీతాలు ఇవ్వకపోవడం, విధుల నుంచి తొలగించడం చట్ట వ్యతిరేకం అన్నారు.

రాష్ట్రంలోని అందరూ ఆర్జేడీలు, డిఈఓలు తమ పరిధిలో ఇలా ఉల్లంఘనకు పాల్పడుతున్న విద్యాసంస్థలను గుర్తించాలని సమగ్ర నివేదిక ఇవ్వాలని చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని జస్టిస్ ఆర్ కాంతారావు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.