గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 18 నవంబరు 2020 (07:58 IST)

ట్విటర్‌లో ఒక తండ్రిపేరు.. బయట మరో తండ్రి పేరు: సంచయితపై అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు

‘ట్విటర్‌లో ఒక తండ్రిపేరు.. బయట మరో తండ్రి పేరు పెట్టుకున్న సంచయితకు సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు ఎలా తెలుస్తాయి?’ అని మాన్సాస్‌ ట్రస్ట్‌ పూర్వ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంచయిత తన జీవితంలో ఏనాడూ గుడికి వెళ్లిన దాఖలాలు లేవన్నారు. మాన్సాస్‌ ట్రస్టు పరిధిలోని 104 దేవాలయాల్లో జరిగే పండుగలకు ఎప్పుడైనా హాజరయ్యారా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని రాజుల కుటుంబమంటూ.. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తావించడాన్ని ఖండించారు.

తాత, తండ్రి ఎవరో తెలియని వారిని తమ కుటుంబంతో పోల్చడం సరికాదన్నారు. సామాజిక మాధ్యమాల్లో కుటుంబం పరువును అభాసుపాలు చేసేలా సంచయిత పోస్టులు పెట్టడం బాధ కలిగించిందన్నారు. ఇటీవల జరిగిన సిరిమానోత్సవం సందర్భంగా కోట బురుజుపై కూర్చున్న వారిని అవమానపరిచినప్పుడే ఆమె ఏంటో అందరికీ తెలిసిందన్నారు.
 
ఎలాంటి సమాచారం లేకుండా బోర్డు నియమించటం సరికాదన్నారు. మాన్సాస్ ట్రస్టు ఆధ్వర్యంలోని తూర్పు గోదావరి గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఛైర్మన్​గా కొనసాగుతున్న తనని తొలగించి.. సంచయితను నియమించటంపై స్పందించారు. 
 సంచయితను నియమించడం చట్టరీత్యా వ్యతిరేకమన్నారు.
 
 ఎలాంటి సమాచారం లేకుండా బోర్డు నియమించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇదంతా రాజకీయ కక్షతో చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని దేవాలయాలపై కన్ను పడిందని దుయ్యబట్టారు.
 
అన్ని మతాలను ప్రభుత్వం గౌరవించాలని, ఒక్కో మతాన్ని ఒక్కో విధంగా చూడటం శుభం కాదన్నారు. తాను మాన్సాస్‌ చైర్మన్‌గా ఉన్నప్పుడు తనతోపాటు రాజ కుటుంబీకులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వంటివారు కోట బురుజుపై ఆశీనులయ్యేవారని గుర్తు చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలోని గ్రూప్‌ దేవాలయాలకు చైర్‌పర్సన్‌గా సంచయితను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవో జారీ చేసిందని అశోక్‌ గజపతిరాజు విమర్శించారు. న్యాయస్థానంలో కేసులు నడుస్తుండగా ప్రభుత్వం ఈ విధంగా చేయడం చట్టం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోందన్నారు.

ఎలాంటి నోటీసు ఇవ్వకుండా రాత్రి పూట నియామకాలు ఏమిటని? ప్రశ్నించారు. మాన్సాస్‌ భూములపై కన్నేయడం వల్లే ప్రభుత్వం దొడ్డిదారి జీవోలను జారీ చేసిందన్నారు. కోర్టులో కేసుండగా తనను తొలగించి వేరే వారిని చైర్మన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.