శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వాసుదేవన్ ఆరంబాకం
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (13:24 IST)

ఆంధ్రలోనూ ఎన్నికల బడ్జెట్.. ఆదాయ వనరులు లేకపోయినా.. ఎన్నికల ముందు..?

సార్వత్రిక ఎన్నికలు.. శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ... అధికార పక్షాలకు మధ్య తరగతి జీవులు, రైతులు తెగ గుర్తొచ్చేస్తున్నారు... అవి మరి వారి ఆలోచనల ఫలితమో లేక ప్రతిపక్షాలు చెప్పుకొస్తున్నట్లు వారి ఐడియాలజీ కాపీలో తెలియదు కానీ... ఎట్టకేలకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో కూడా దాదాపు రైతులపై వరాల జల్లు కురిపించేసారు యనమల రామక్రిష్ణుడు. 
 
ఇందులో భాగంగా రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని ప్రకటించిన మంత్రి ఈ పథకానికిగానూ రూ. 5 వేల కోట్లు మొత్తాన్ని కేటాయించారు. అలాగే ప్రభుత్వం పలు కొత్త పథకాలకూ నిధులను మంజూరు చేసింది. రాష్ట్రంలో మొత్తం సంక్షేమ పథకాల కోసం రూ.65,486 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు ప్రకటించింది.
 
అయితే... ఎన్నికల సందర్భంగా మధ్యంతర బడ్జెట్‌ని ప్రవేశ పెట్టవలసిన అధికార పక్షం రాజ్యాంగానికి విరుద్ధంగా పూర్తిస్థాయి బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం... ఆదాయ వనరులు లేకపోయినా.. ఎన్నికల ముందు ఊహాజనిత గణాంకాలతో భారీ మొత్తం బడ్జెట్‌ కేటాయింపులు చేసేస్తామనే రీతిలో సర్కారు వ్యవహార శైలి పట్ల పలువురు రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.