1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (10:57 IST)

ప్రియ ప‌చ్చ‌ళ్లు ఎదురుగా పెట్టుకుని... మంత్రి కొడాలి నాని తిట్ల పురాణం!

చంద్రబాబు చెప్పే దొంగ మాటలను, సిగ్గు, శరం లేకుండా ఈనాడు రామోజీరావు దొంగ రాతలు రాస్తున్నార‌ని మంత్రి కొడాలి నాని విమ‌ర్శించారు. దాన్నే పట్టుకుని ఆ కుల పత్రికలు, కుల మీడియా, కుల ప్రతినిధులంతా కలిసికట్టుగా రాష్ట్ర ప్రభుత్వంపైన, ముఖ్యమంత్రి జగన్ గారిపైనా పనిగట్టుకుని విషం చిమ్ముతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దున్నపోతు ఈనిందని చంద్రబాబు చెబితే,  దూడను కట్టేయడానికి బయల్దేరినట్టుగా ఈనాడు రామోజీ వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు.


రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలపై చంద్రబాబు చెప్పాడని, ఈనాడు రెండు రోజులు రెండు రకాల ధరలను అచ్చేసి అడ్డంగా దొరికిపోయిందని,  ఆ ధరలకు సంబంధించిన ఈనాడు ప్రచురించిన జనవరి 4, జనవరి 5 తేదీల పత్రికలను సాక్ష్యాలుగా చూపిస్తూ కొడాలి నాని వారి కుట్రలను మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. బాబు-రామోజీ చెప్పిన ధరల కన్నాహెరిటేజ్ లో, బహిరంగ మార్కెట్ లో కూడా ధరలు తక్కువ ఉన్నాయని హెరిటేజ్ బిల్లులు, ఇతర ఆధారాలతో సహా మీడియా ముందు ప్రదర్శించారు. 
 
 
ప్ర‌భుత్వంపైనా, ముఖ్యమంత్రి జగన్ గారిపైన నిత్యం విషం చిమ్ముతూ, అబద్ధాలను, అసత్యాలను పోగేసి దుష్ప్రచారం చేస్తున్న ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ-5 ఛానళ్ళను వైయస్ఆర్ కాంగ్రెస్  పార్టీ శ్రేణులు పూర్తిగా బహిష్కరించాలని మంత్రి పార్టీ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి-సంక్షేమాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి జగన్ గారి సంకల్పాన్నిగానీ, ఆ దిశగా సాగిస్తున్న మహాయజ్ఞాన్నిగానీ..  చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులు అడ్డుకోలేరని మంత్రి స్పష్టం చేశారు. బాటిల్ పచ్చళ్ళు బయట రూ. 200 ఉంటే రామోజీ సంస్థలో ప్రియా పచ్చళ్ళ ధర రూ. 280 అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇలా, బాబు, రామోజీ సిగ్గు, శరం వదిలేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.