సోమవారం, 17 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 నవంబరు 2025 (13:00 IST)

చాయ్‌వాలా దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యారు? సీఎం చంద్రబాబు ప్రశ్న

chandrababu naidu
మన దేశానికి ఒక చాయ్‌వాలా ఎలా ప్రధానమంత్రి అయ్యారు అంటే అది డాక్టర్ బీఆర్ అంబేద్కర్  రూపొదించిన రాజ్యాంగమేనని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో ఏపీ హైకోర్టు న్యాయవాదుల ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడుతూ, బీఆర్‌ అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని, చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే దానికి కారణం మన రాజ్యాంగమేనని అన్నారు. 
 
'ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయి. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో ఆర్థిక వ్యవస్థకు చేరాం. వచ్చే ఏడాది భారత్‌ ప్రపంచంలో మూడో, 2038 నాటికి రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కాబోతోంది. 2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది లక్ష్యం. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయ వ్యవస్థే దాన్ని గాడిన పెడుతోంది. మీడియా రంగంలోనూ ఇటీవల చాలా మార్పులు వచ్చాయి. సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరూ రైటరే.. ప్రతి ఒక్కరూ ఎడిటరే. సామాజిక మాధ్యమాలను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరం' అని చంద్రబాబు అన్నారు.