గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (09:30 IST)

29 నుంచి ఏపీలో కరోనా టీకాల పంపిణీ .. ముందు ఓ లారీ డ్రైవర్‌కు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే... తొలుత కృష్ణా జిల్లా నుంచి కరోనా టీకాలను పంపిణీ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. అదీకూడా తొలి టీకాను ఓ లారీ డ్రైవర్‌కు వేయాలని భావిస్తోంది. 
 
ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్‌ను కట్టడి చేసే క్రమంలో అనేక దేశాల్లో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. భారత్‌లోనూ మరికొన్నిరోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ షురూ కానుంది. 
 
అయితే, వ్యాక్సిన్ పంపిణీ వేళ తలెత్తే సమస్యలను అంచనా వేయడానికి దేశంలో నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్ నిర్వహించనున్నారు. ఏపీలో ఈ మాక్ డ్రిల్‌కు సంబంధించిన సన్నాహాలకు ప్రభుత్వం తెరలేపింది. రాష్ట్రంలో అందుకోసం కృష్ణా జిల్లాను ఎంపిక చేశారు.
 
జిల్లాలోని ఐదు ప్రాంతాల్లో కో-విన్ అనే యాప్ ద్వారా వ్యాక్సిన్ అందించేవారి జాబితా రూపొందిస్తారు. ఈ డ్రై రన్ ప్రక్రియలో వైద్య బృందాలు కూడా పాల్గొంటాయి. 
 
దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ, ఈ నెల 27 నుంచి  29 వరకు కరోనా వ్యాక్సిన్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆదివారం యాప్‌కు సంబంధించిన మాక్ డ్రిల్ చేపడతామని, ఎల్లుండి వ్యాక్సిన్ రవాణా, పంపిణీ, ఈ నెల 29న వ్యాక్సిన్ ట్రయల్ రన్ ఉంటుందని వివరించారు.