1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (09:48 IST)

వామ్మో.. ఇదెక్కడి విడ్డూరం... బొత్స కోసం అసెంబ్లీకి సెలవా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రతి ఒక్కరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నాయకుల ఇంట జరిగే శుభకార్యాలకు అసెంబ్లీకి సెలవు ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు వివాహం రిసెప్షన్ కోసం ఏకంగా అసెంబ్లీ సమావేశానికే సెలవు ప్రకటించండం ఏంటని ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. 
 
అదే అంశంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ ఎల్పీ సమావేశంలో టీడీపీ నేతలు ఈ విషయాన్ని ప్రస్తావించారు. నేతల ఇళ్లలో జరిగే పెళ్లిళ్లు, పేరంటాలకు, కర్మక్రతువులకు కూడా సభకు సెలవు ఇస్తారా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. 
 
మాకు పాఠాలు చెప్పనక్కర్లేదు...  
వయసులో పెద్దవారైన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను గౌరవించాలని వైకాపా అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉందని టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేస్తూ, గవర్నర్‌ను ఎలా గౌరవించాలో తమకు జగన్ చెప్పాల్సిన పనిలేదన్నారు.
 
వయసులో పెద్దవారైన గవర్నర్‌ను గౌరవించాలని జగన్ చెబుతున్నారని, మరి వయుసులో పెద్దవారు, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డికి ఆయనిచ్చిన గౌరవం ఏపాటిదో అందరికీ తెలుసని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. 
 
కాగా, సోమవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల తొలి రోజున గవర్నర్‌కు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆందోళన చేస్తూ, గవర్నర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగ ప్రతులను కూడా వారు చింపివేశారు. ఈ చర్యలపై సీఎం జగన్ టీడీపీ సభ్యులపై మండిపడ్డారు.