శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 2 ఆగస్టు 2024 (10:01 IST)

మైనింగ్ ఘనుడు వెంకట్ రెడ్డిపై ఏసీబీ విచారణకు ఏపీ సర్కారు ఆదేశం!!

venkat reddY
గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు అక్రమంగా, ఇష్టానురీతిలో రాష్ట్రంలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు సహకరించిన మైనింగ్ ఘనుడు గత ప్రభుత్వంలో గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిపై అవినీతి, అక్రమాలపై టీడీపీ, జనసేన, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్‌ దృష్టి పెట్టింది. విచారణ జరపాల్సిందిగా ఏసీబీని ఆదేశించింది. సిలికా శాండ్, క్వార్ట్జ్ దోపిడీ వెనుక ఆయన హస్తముందన్న ఆరోపణలతో మరిన్ని కేసులు పెట్టనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వెంకటరెడ్డి ఆచూకి ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. ఫోన్‌ నంబర్ కూడా మార్చేసినట్లు సమాచారం. 
 
ఇప్పటికే గనులు, ఇసుక అక్రమాల వ్యవహారంలో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వైఎస్సార్సీపీ హయాంలో ఆయన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీ డీజీని ఆదేశిస్తూ సీఎస్ నీరబ్​కుమార్‌ ప్రసాద్​ గురువారం మెమో జారీ చేశారు. ఇసుక అక్రమాలపై గనుల శాఖ ఇచ్చిన నివేదికను డీజీకి పంపించారు. 
 
ఇండియన్ కోస్ట్ గార్డ్స్ సీనియర్ సివిలియన్ స్టాఫ్ ఆఫీసర్ అయిన వెంకటరెడ్డి 2019 డిసెంబర్​లో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో చేరారు. ఆ తర్వాత గనుల శాఖ డైరెక్టర్‌గా, కొన్నాళ్లకు ఏపీఎండీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆ శాఖలో ఆయన అక్రమాలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్డీయే ప్రభుత్వం రాగానే జూన్ 7న వెంకటరెడ్డిని ఆ రెండు పోస్టుల నుంచి తొలగించింది. జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
 
వెంకటరెడ్డి సస్పెన్షన్​ ఉత్తర్వుల్లో హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాల కాపీని ఆయనికి అందజేయాల్సిందిగా గనుల శాఖ సంచాలకుడికి సూచించగా, అతని ఆచూకీ దొరకడం లేదని తెలిసింది. విజయవాడ కేసీపీ కాలనీలోని ఏపీఎండీసీ అతిథిగృహంలో మూడున్నరేళ్ల పాటు కుటుంబంతో వెంకటరెడ్డి నివాసం ఉన్నారు. జులైలో దాన్ని ఖాళీచేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఫోన్ నంబర్ మార్చేశారని తెలిసింది.