శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (16:21 IST)

నిరుద్యోగ యువతకు సీఎం జగన్ తీపి కబురు.. ఇంటర్వ్యూలు లేకుండా..?

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలో మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సీఎం జగన్‌ విడుదల చేశారు. దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్ ప్రకటించామ‌న్నారు. 
 
2021-22 ఏడాదికి 10,143 ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. అత్యంత పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయన్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా మెరిట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని చెప్పారు. రాత పరీక్షలో వచ్చిన మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ చేస్తామని.. ఇంటర్వ్యూ లేకుండానే ఉద్యోగాల భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. 
 
ఏ ఉద్యోగం ఏ నెలలో వస్తుందో తెలియజేసేందుకు క్యాలెండర్‌ తెస్తున్నామని సీఎం జగన్​ అన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని జగన్‌ గుర్తు చేశారు. ఒకేసారి లక్షకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడా లేదన్నారు. 
 
వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.50లక్షలకు పైగా నిరుద్యోగులకు ఆస‌రా క‌ల్పించామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్పటివరకు 6 లక్షల 3 వేల 756 ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం జగన్‌ వివరించారు. దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామ‌ని సీఎం చెప్పారు.