శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 18 జూన్ 2019 (14:10 IST)

ఇంకా నయం లోకేశ్‌ను మంత్రిపదవిలో కొనసాగించాలని కోరలేదు : మంత్రి బొత్స

ఏపీ శాసనసభ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వాదోపవాదాలు తారా స్థాయిలో జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా, మంగళవారం ఏపీ శాసనమండలిలో వృద్ధాప్య పింఛన్లపై చర్చ జరిగింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ గౌరినేని శ్రీనివాస రావు పాల్గొని మాట్లాడుతూ, వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.3 వేలు పింఛన్ ఇస్తానని సీఎం జగన్ ఎన్నికలకు ముందు ప్రకటన చేశారనీ, ఎన్నికలు ముగిసి అధికారంలోకి రాగానే తన హామీని విస్మరించి మోసం చేశారని ఆరోపించారు. 
 
దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ ధీటుగా సమాధానమిచ్చారు. వితంతువులు, వృద్ధులకు ఏకంగా రూ.3 వేలు చొప్పున పింఛన్లు ఇస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కడా చెప్పలేదని గుర్తుచేశారు. అదేసమయంలో వృద్ధులు, వితంతువులకు యేడాదికి రూ.250 చొప్పున పెంచుతూ వచ్చే ఐదేళ్ళలో ఈ పింఛనను రూ.3 వేలకు పెంచుతామని ఆయన వెల్లడించారు. 
 
అంతేకాకుండా, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. గతంలో కూడా టీడీపీ కూడా అలానే చేసిందన్నారు. ఈ విషయం టీడీపీ నేతలకు బాగా తెలుసన్నారు. ఇపుడు కూడా తమ ప్రభుత్వం అదే పని చేస్తుందన్నారు. 
 
ఇంకా నయం... రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైనా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేశ్‌ను మంత్రిపదవిలో కొనసాగించాలని అనలేదు అని మంత్రి బొత్స చలోక్తి విసిరారు. బొత్స వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు.