1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 24 మే 2025 (16:16 IST)

ఎగ్జిబిటర్లు అలా ఎందుకు అన్నారో తెలియాల్సివుంది : మంత్రి కందుల దుర్గేశ్

kandula durgesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్లను బంద్ చేయాలని ఆ నలుగురు ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేశారని సాగుతున్న ప్రచారంతో పాటు దాని వెనుక ఎవరున్నారో తెలియాల్సివుందని, అందుకే పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్టు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ - నిధి అగర్వాల్ జంటగా నటించిన తాజాగా చిత్రం "హరిహర వీరమల్లు" చిత్రం. జూన్ 12వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్లు బంద్ చేయనున్నట్టు ప్రకటించారు. ఇది ఏపీ ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. థియేటర్లను బంద్ చేయాలని పిలుపునివ్వడానికి గల కారణాలతో పాటు దీని వెనుకు ఎవరున్నారో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి విచారణకు మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. 
 
థియేటర్ల బంద్‌కు సంబంధించి ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ముఖ్యంగా, పవన్ కళ్యాణ్ సినిమాకు అడ్డంకులు సృష్టించేందుకే కొందరు (ఆ నలుగురు) థియేటర్ల యాజమాన్యంపై ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో మంత్రి ఈ ఆదేశాలు జారీచేశారు. 
 
ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిసికట్టుగా ఒక బృందంగా ఏర్పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశాలను కూడా పరిశీలించాలని మంత్రి సూచించారు. ఈ బంద్ కారణంగా ఎన్ని సినిమాలు నష్టపోతాయి, ప్రభుత్వానికి రావాల్సిన పన్నుల ఆదాయానికి ఎంతవరకు గండి పడుతుంది అనే కోణంలోనే కూడా వివరాలు సేకరించాలని ఆదేశించినట్టు తెలిపారు.