కిలేడీ లేడీ అరుణ వ్యవహారంలో తప్పంతా అధికారులదే : మంత్రి నాదెండ్ల
నెల్లూరు జిల్లాకు చెందిన కిలేడీ లేడీ, లేడీ డాన్ అరుణ వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు సరిగా స్పందించలేదని, అందుతే రాజకీయ పార్టీల నేతలు నిందలు పడాల్సి వచ్చిందని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయపడ్డారు. సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం జరిగింది. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల విలేకరులతో మాట్లాడుతూ, కిలేడీ అరుణ వ్యవహారంలో అధికారులు సరైన రీతిలో స్పందించకపోవడం వల్లే నేతలు నింద పడాల్సి వస్తోందన్నారు.
అరుణ.. రౌడీషీటర్ శ్రీకాంత్కు పెరోల్ ఇప్పించిన ఘటనలో అధికారులు కూడా స్పందించి ఉండాల్సిందన్నారు. సుగాలి ప్రీతి అంశంలోనూ గత ప్రభుత్వ నిర్లక్ష్యంపై అధికారులు మాట్లాడితే బాగుండేదని మనోహర్ అభిప్రాయపడ్డారు. ప్రతిదానికీ తామే స్పందించాల్సివస్తుందన్నారు. నిజాలు తెలిసిన ప్రభుత్వ అధికారులు మాత్రం నోరు మెదపడం లేదన్నారు.
అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలపై ఎలాంటి విమర్శలు వచ్చినా గట్టిగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సహచరులకు సూచించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం రాజకీయ అంశాలపై చర్చ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై రాహుల్ గాంధీ విమర్శలను సకాలంలో తిప్పికొట్టాల్సి ఉందన్నారు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ.. ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థంగా తిప్పికొడదామని తెలిపారు.